Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!

  • వైభవ్ సూర్యవంశీకి టీమిండియా నుంచి పిలుపు
  • ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడల కోసం జట్టులో చోటు
  • గంట ముందు మాత్రమే వైభవ్ పేరు తెరపైకి
Vaibhav Sooryavanshi Bcci

Vaibhav Sooryavanshi Bcci

BCCI on Vaibhav Sooryavanshi Selection: భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకుని.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం బుడ్డోడి పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆరెంజ్ క్యాప్‌ను కైవసం:
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదినప్పటి నుంచే వైభవ్ సూర్యవంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. గత సీజన్‌లో పరిమిత అవకాశాలు వచ్చినప్పటికీ.. తన ప్రతిభను చాటుకున్నాడు. ఐపీఎల్ 2026లో మాత్రం పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ షర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, హెన్రిచ్ క్లాసెస్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ బ్యాటర్లను వెనక్కి నెట్టి అత్యధిక పరుగుల వీరుడిగా బుడ్డోడు నిలిచాడు.

×
×
Ad

కేవలం గంట ముందు మాత్రమే:
వైభవ్ సూర్యవంశీ ఎంపికపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వైభవ్ అసలు తమ ప్రణాళికల్లోనే లేదని చెప్పారు. భారత జట్టు ప్రకటించే మీడియా సమావేశానికి కేవలం గంట ముందు మాత్రమే అతడి ఎంపికపై తుది నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘వైభవ్ ఎంపికపై తుది నిర్ణయం ఈరోజే తీసుకున్నాం. జట్టు ప్రకటనకు గంట ముందు తీసుకున్నాం. అతడు ఇండియా-ఏ జట్టులో కూడా ఉన్నాడు. అతనికి ఏది ఉత్తమమో దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. అయితే ప్రస్తుతం ప్రాధాన్యత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకే ఉంటుంది. సరైన సమయంలో దీనిపై స్పష్టత ఇస్తాం’ అని దేవజిత్ సైకియా వెల్లడించారు.

టీమిండియా జెర్సీలో ఎలా రాణిస్తాడో:
భారత టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. వైభవ్ సూర్యవంశీతో పాటు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వంటి ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో ఇండియా-ఏ తరఫున త్రైపాక్షిక సిరీస్‌కు సిద్ధమవుతున్న వైభవ్.. జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌లో తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన ఈ యువ సంచలనం.. ఇప్పుడు టీమిండియా జెర్సీలో ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.