BCCI Backs Gautam Gambhir, Shreyas Iyer: భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. టీ20 సిరీస్లో ఇప్పటికే మొదటి మ్యాచ్ పూర్తి కాగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరగనుంది. పొట్టి సిరీస్ నేపథ్యంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్కు అవకాశం దక్కకపోవడంతో జట్టు యాజమాన్యం, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జట్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
కోచ్, కెప్టెన్దే పూర్తి బాధ్యత:
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్లనే టీమిండియా కొనసాగించింది. దీంతో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం మరోసారి వాయిదా పడింది. అంతకుముందు ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ బుడ్డోడికి తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో పలువురు అభిమానులు, మాజీ క్రికెటర్లు జట్టు యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలకు దిగారు. ఈ విమర్శలపై స్పందించిన రాజీవ్ శుక్లా.. వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడని, ఐపీఎల్లో తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడని కొనియాడారు. అయితే తుది జట్టును ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా కోచ్, కెప్టెన్దే అని చెప్పి.. మాజీలకు గట్టిగా ఇచ్చిపడేశారు.
అనవసర వ్యాఖ్యలకు తావు ఇవ్వకూడదు:
‘వైభవ్ సూర్యవంశీ ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడు. ఐపీఎల్లో అతడు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కానీ భారత జట్టులో ఎవరిని ఆడించాలన్నది కోచ్, కెప్టెన్ కలిసి నిర్ణయం తీసుకుంటారు. మ్యాచ్ పరిస్థితులు, జట్టు అవసరాలను బట్టి సరైన సమయంలో వైభవ్కు అవకాశం దక్కుతుంది. ఈ విషయంలో అనవసర విమర్శలు చేయడం సరైంది కాదు. బయట కూర్చొని ఎన్నో మాట్లాడొచ్చు. భారత జట్టులో తీవ్ర పోటీ ఉంది. ఓ ఆటగాడిని తప్పించి.. ఇంకొకరికి అవకాశం ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. వైభవ్కు అవకాశం ఆలస్యమైనా.. తప్పకుండా వస్తుంది. జట్టు యాజమాన్యం తీసుకునే నిర్ణయాలను గౌరవించాలి. అలాంటి విషయాల్లో అనవసర వ్యాఖ్యలకు తావు ఇవ్వకూడదు’ అని రాజీవ్ శుక్లా ఘాటుగా స్పందించారు.
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన:
15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. 16 ఇన్నింగ్స్ల్లో 776 పరుగులు చేసి.. 237.30 స్ట్రైక్రేట్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను టోర్నమెంట్లో అత్యుత్తమ ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. వైభవ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జాతీయ సెలెక్టర్లు అతడిని భారత టీ20 జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ.. తుది జట్టులో అవకాశం కల్పించే విషయంలో టీమ్ మేనేజ్మెంట్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో రాబోయే మ్యాచ్ల్లో ఈ యువ సంచలనానికి అరంగేట్రం దక్కుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

