Kamran Akmal on Vaibhav Sooryavanshi: అఫ్గానిస్థాన్తో తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో ఆదివారం జరిగిన తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ బెంచ్కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్కు అవకాశం దక్కింది. అయితే ఈ మ్యాచ్లో సంజు పెద్దగా ప్రభావం చూపలేడు. 8 బంతుల్లో 10 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. సంజు విఫలమవడంతో వైభవ్ను ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.
ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత కూడా అఫ్గానిస్థాన్తో సిరీస్లో తొలి మ్యాచ్కు అతడిని పక్కన పెట్టడంపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా వైభవ్కు మద్దతుగా నిలిచాడు. అఫ్గానిస్థాన్ వంటి చిన్న జట్లతో జరిగే ద్వైపాక్షిక సిరీస్లను యువ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో వైభవ్ను ఆడించినప్పుడు.. అఫ్గానిస్థాన్తో ఎందుకు ఆడించలేదని ప్రశ్నించాడు. చిన్న జట్లపై ఆడటం ద్వారా భవిష్యత్లో ఉపయోగపడే బ్యాకప్ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవచ్చని కమ్రాన్ సూచించాడు.
గతంలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇలాంటి మ్యాచ్ల్లో విశ్రాంతి తీసుకునేవారని కమ్రాన్ అక్మల్ గుర్తు చేశాడు. కీలక ఆటగాళ్లలో కొందరికి విశ్రాంతి ఇచ్చి.. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం ద్వారా జట్టు బెంచ్ బలాన్ని పెంచుకోవచ్చని పేర్కొన్నాడు. అఫ్గానిస్థాన్తో సిరీస్లో వంద శాతం వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టరు అని, బీసీసీ ఎందుకు ఆడించలేదో అన్నాడు. అఫ్గానిస్థాన్తో సిరీస్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో తనకు అర్థం కావడం లేదని అన్నాడు. చిన్న జట్లపై స్టార్లను ఎందుకు ఆడిస్తుందో అని బీసీసీఐని కమ్రాన్ అక్మల్ ప్రశ్నించాడు.
అఫ్గానిస్థాన్తో రెండో టీ20కి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సైడ్ స్ట్రెయిన్ కారణంగా మొత్తం టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఈ గాయం కారణంగా ఆసియా క్రీడల్లో అతడు ఆడటం కూడా అనుమానంగా మారింది. ఇంగ్లాండ్ పర్యటనలో హ్యామ్స్ట్రింగ్ గాయంతో బాధపడిన వరుణ్ ఇటీవలే కోలుకున్నాడు. అఫ్గానిస్థాన్తో తొలి టీ20లో బరిలోకి దిగిన అతడు నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే తాజాగా నిర్వహించిన ఎంఆర్ఐలో సైడ్ స్ట్రెయిన్ ఉన్నట్లు తేలడంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వరుసగా ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటంతో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతున్న గాయాల నిర్వహణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వరుణ్ గాయం టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్ 22న జపాన్తో భారత్ చారిత్రాత్మక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి నిషిన్లో ఆసియా క్రీడల క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి నేటి మ్యాచ్లో అవకాశం దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

