Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

  • ఇండియా-ఎ, శ్రీలంక-ఎ మ్యాచ్లో వివాదం
  • సూర్యవంశీ, హలంబగే మధ్య వాగ్వాదం
  • తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Comments

Tilak Varma Comments

Tilak Varma React on Vaibhav Sooryavanshi Fight: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య సోమవారం దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న వివాదం మరింత ముదురుతోంది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక విజయం సాధించిన అనంతరం భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగే మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది. కాసేపైతే ఇద్దరు మైదానంలోనే కొట్టుకునేవారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

శ్రీలంక ఆటగాళ్ల ప్రవర్తన నచ్చలేదు:

మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘నేను ఎవరికీ ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇక్కడ లేను. కానీ 15 ఏళ్ల చిన్న వయసున్న వైభవ్ సూర్యవంశీతో శ్రీలంక ఆటగాళ్లు వ్యవహరించిన తీరు నాకు అస్సలు నచ్చలేదు. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ ప్రశాంతంగా వెళ్తున్నాడు. ఆ సమయంలో శ్రీలంక ఆటగాళ్లే అతడితో గొడవకు ప్రయత్నించారు. ఇది క్రికెట్‌కు అస్సలు మంచిది కాదు. భారత్-శ్రీలంక క్రీడా సంబంధాలకు కూడా ఇలాంటి సంఘటనలు మంచివి కావు’ అని తిలక్ ఫైర్ అయ్యాడు.

×
×
Ad

పూర్తి సంతోషంగా ఉన్నా:

‘ఈ మ్యాచ్ కూడా చివరి వరకు హోరాహోరీగా సాగింది. కానీ దురదృష్టవశాత్తు మేము సూపర్ ఓవర్‌లో ఓడిపోయాము. సూర్యాన్ష్, విప్రజ్ మధ్య భాగస్వామ్యం అద్భుతం. ఒత్తిడిలో కూడా వారు చాలా బాగా ఆడారు. మొత్తంగా మా బౌలింగ్ బాగుంది. స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. అర్షద్ ఖాన్ డెత్ ఓవర్లలో చక్కగా బౌలింగ్ చేశాడు. మా బౌలర్లు మ్యాచ్ చివరి బంతి వరకు తీసుకెళ్లారు. మా ప్రదర్శనపై పూర్తి సంతోషంగా ఉన్నాను’ అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.

ఉత్కంఠగా సాగిన మ్యాచ్:

రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన థ్రిల్లర్‌ను అందించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక-ఎ కూడా 50 ఓవర్లలో 265/9 స్కోరు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో శ్రీలంక 16 పరుగులు చేయగా.. భారత జట్టు 10 పరుగులకే పరిమితమైంది. దీంతో లంక 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సూపర్ ఓవర్‌లో కూడా వివాదం:

సూపర్ ఓవర్ సందర్భంగా కూడా భారీ డ్రామా చోటుచేసుకుంది. తొలుత శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసినట్లు భావించిన భారత ఆటగాళ్లు మైదానం వీడారు. అయితే అంపైర్లు చివరి బంతిని నోబాల్‌గా ప్రకటించి మరో బంతి వేయాలని సూచించడంతో కెప్టెన్ తిలక్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్లు, అంపైర్ల మధ్య కొంతసేపు వాగ్వాదం కూడా జరిగింది. అదనపు బంతి తర్వాత శ్రీలంక స్కోరు 16 పరుగులకు చేరగా.. భారత్ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది.

వైరల్‌గా మారిన వైభవ్-లంక ప్లేయర్ ఘర్షణ:

మ్యాచ్ ముగిసిన వెంటనే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడు విశెన్ హలంబగే మధ్య మాటామాటా పెరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు జట్ల ఆటగాళ్లు జోక్యం చేసుకుని వారిని విడదీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. తిలక్ వర్మ చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ రిఫరీ ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.