Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!

  • టీమిండియాకు పసికూన ఐర్లాండ్ భారీ షాక్
  • టీ20 సిరీస్‌ 2-0తో ఐర్లాండ్ కైవసం
  • భారత్ అజేయ పరంపరకు బ్రేక్
India Vs Ireland

India Vs Ireland

Team India unbeaten 16 T20 Series Streak Ends: భారత్ క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ భారీ షాక్ ఇచ్చింది. ఆదివారం బెల్‌ఫాస్ట్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియాను ఒక పరుగు తేడాతో ఓడించి.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్‌పై ఏ ఫార్మాట్‌లో ఆయినా ఐర్లాండ్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. హ్యారీ టెక్టార్‌ (53; 47 బంతుల్లో) హాఫ్ సెంచరీతో ఐర్లాండ్‌ 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఛేదనలో భారత్‌ 9 వికెట్లకు 153 పరుగులే చేసి ఓడిపోయింది. తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ (55; 46 బంతుల్లో) రాణించాడు. భారత సంతతి ఆటగాడు జై ముంద్రా (3/32) సహా హాలార్డ్‌ (3/26) చెలరేగారు.

1050 రోజుల తర్వాత:

ప్రపంచ ఛాంపియన్ భారత్ 1050 రోజుల తర్వాత ఓ టీ20 అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోయింది. చివరిసారిగా భారత్ 2023 ఆగస్టులో వెస్టిండీస్ చేతిలో టీ20 సిరీస్‌ ఓడిపోయింది. అప్పటి నుంచి వరుసగా సిరీస్‌లు గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ విజయ పరంపరకు ఐర్లాండ్ బ్రేక్ వేసింది. ఐర్లాండ్‌పై ఓటమితో భారత్ వరుస 16 టీ20 సిరీస్‌ల అజేయ పరంపరకు తెరపడింది. పూర్తి స్థాయి సభ్య జట్లలో 2016-2018 మధ్య పాకిస్థాన్ 11 సిరీస్‌ విజయాల అజేయ పరంపర కొనసాగించింది. టీమిండియా ఏకంగా వరుసగా 16 టీ20 సిరీస్‌లు గెలిచింది. పసికూన ఐర్లాండ్ అద్భుత ఆటతో టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చి.. అజేయ పరంపరకు బ్రేక్ వేసింది.

బ్యాటింగ్ వైఫల్యమే కారణం:

మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓటమిని నిజాయితీగా అంగీకరించాడు. ‘ఓటమి మమ్మల్ని చాలా నిరాశ కలిగిచింది. మేము చాలా చెత్తగా ఆడాం. బ్యాటింగ్ వైఫల్యమే ఈ కూటములకు కారణం. ఐర్లాండ్ అద్భుతంగా ఆడింది. ఈ పిచ్‌పై ఎలా ఆడాలో వారికి స్పష్టమైన అవగాహన ఉంది. వారి ఫీల్డింగ్ అద్భుతంగా సాగింది. బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి తమ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేశారు. అన్ని విభాగాల్లో వారు మమ్మల్ని పూర్తిగా అధిగమించారు. సూర్యాంశ్‌తో పాటు మా యువ బౌలర్లు తమదైన ఆలోచనలతో బౌలింగ్ చేశారు. అని అయ్యర్ చెప్పాడు.

యాదృచ్ఛికం కాదని ప్రపంచానికి చూపించాం:

ఐర్లాండ్ కెప్టెన్ లోర్కన్ టక్కర్ జట్టు ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఈ విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మొదటి మ్యాచ్ విజయం యాదృచ్ఛికం కాదని ప్రపంచానికి చూపించాలని ఆటగాళ్లకు చెప్పాను. వారు మేము సిద్దమే అని చెప్పారు. గత మ్యాచ్‌లో ఎలా ఆడామో.. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఉద్దేశంతో బరిలోకి దిగాం. క్రికెట్‌ను సింపుల్‌గా ఆడితేనే విజయాలు వస్తాయని మేము నిరూపించాం. మా జట్టులో అంతర్జాతీయ అనుభవం తక్కువ ఉన్న ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నా.. వారు గొప్ప ధైర్యాన్ని చూపించారు. భారత్‌తో ఇలాంటి సిరీస్‌లు ఆడే అవకాశం రావడం మా అదృష్టం. ప్రస్తుతం ఐర్లాండ్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఉండటం ఎంతో గర్వంగా ఉంది’ అని టక్కర్ పేర్కొన్నాడు.