Site icon NTV Telugu

Indian Cricket Golden Era: వరల్డ్ క్రికెట్‌లో భారత్ సువర్ణాధ్యాయం.. రెండేళ్లలో ఐదు ఐసీసీ ట్రోఫీలు!

Indian Cricket Golden Era

Indian Cricket Golden Era

Indian Cricket Golden Era: భారత క్రికెట్ మరోసారి ప్రపంచానికి తన శక్తిని చాటింది. సీనియర్ నుంచి అండర్‌-19 వరకూ.. పురుషులు, మహిళలు అన్ని విభాగాల్లో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తూ ఐసీసీ ట్రోఫీలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని నెలకొల్పింది. ప్రస్తుతం భారత్ ఒకేసారి ఐదు ప్రధాన ఐసీసీ టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకుని ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది.

పురుషుల విభాగంలో భారత్ 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుని పొట్టి ఫార్మాట్‌లో తన సత్తాను నిరూపించింది. ఆ తర్వాత 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకుని. వన్డే క్రికెట్‌లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ రెండు విజయాలు భారత సీనియర్ జట్టు స్థిరత్వం, లోతైన బెంచ్ స్ట్రెంత్‌కు నిదర్శనంగా నిలిచాయి.

మహిళల క్రికెట్‌లోనూ భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకుని తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని భారత మహిళల జట్టు అందుకుంది. అంతేకాదు, అదే ఏడాది జరిగిన మహిళల అండర్‌-19 వరల్డ్‌కప్‌లోనూ భారత్ విజేతగా నిలిచి యువ ప్రతిభలోనూ తన ఆధిపత్యాన్ని చాటింది.

Also Read: U19 World Cup Winners List: అండర్ 19 వరల్డ్‌కప్ విజేతల జాబితా.. భారత్‌ ఆధిపత్యం మామూలుగా లేదుగా!

యువ క్రికెట్‌లో భారత జట్టు ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2026లో జరిగిన పురుషుల అండర్‌-19 వరల్డ్‌కప్‌ను గెలుచుకుని భారత్ మరోసారి భవిష్యత్ క్రికెట్ తనదేనని నిరూపించింది. వరుసగా వస్తున్న యువ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి సిద్ధంగా ఉండటం భారత క్రికెట్ వ్యవస్థ బలాన్ని చూపిస్తోంది.

ప్రస్తుతం భారత్ ఒకేసారి పురుషుల టీ20 వరల్డ్‌కప్ (2024), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2025), మహిళల వన్డే వరల్డ్‌కప్ (2025), మహిళల అండర్‌-19 వరల్డ్‌కప్ (2025), పురుషుల అండర్‌-19 వరల్డ్‌కప్ (2026) టైటిల్స్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతగా నిలుస్తోంది. అన్ని స్థాయిల్లోనూ విజయాలు సాధిస్తూ.. భారత క్రికెట్ నిజంగా స్వర్ణయుగంలోకి అడుగుపెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version