Site icon NTV Telugu

T20 World Cup 2026: భారత్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని పాక్‌ నిర్ణయం.. ఎవరికి ప్లస్..? ఎవరికి మైనస్..?

India Pakistan

India Pakistan

T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడే మ్యాచ్‌లపై పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.. భారత్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయం గ్రూప్ A అర్హత సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఒక వైపు భారత్‌కు లాభం చేకూరుతుండగా, మరోవైపు పాకిస్తాన్‌కు ఇది ఘోరమైన దెబ్బగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ మైదానంలోకి దిగకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్‌కు వాక్‌ఓవర్ ద్వారా పూర్తి రెండు పాయింట్లు లభిస్తాయి. పాకిస్తాన్‌కు మాత్రం నేరుగా సున్నా పాయింట్లు ఖాతాలో పడతాయి. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ స్థానం మరింత బలపడనుండగా, పాకిస్తాన్ పరిస్థితి కఠినంగా మారనుంది.

Read Also: Dhurandhar 2 – Toxic : ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. సౌత్ ఆడియెన్స్ ఓటు ఎవరికో?

ఈ నిర్ణయ ప్రభావం కేవలం పాయింట్ల వరకే పరిమితం కాదు. నెట్ రన్ రేట్ (NRR)పై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది. ఐసీసీ ఆట నియమాల ప్రకారం మ్యాచ్‌ను ఆడకపోతే, డిఫాల్ట్ అయిన జట్టు నెట్ రన్ రేట్ దెబ్బతింటుంది. భవిష్యత్తులో అర్హత నిర్ణయంలో NRR కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో, పాకిస్తాన్‌కు ఇది మరో పెద్ద సమస్యగా మారుతుంది. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యునైటెడ్ స్టేట్స్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి తొలి రెండు జట్లు సూపర్ 8 దశకు అర్హత సాధిస్తాయి. భారత్‌కు భారత్–పాక్ మ్యాచ్ ద్వారా రెండు పాయింట్లు లభిస్తే, మిగిలిన మ్యాచ్‌లను పెద్దగా ఒత్తిడి లేకుండా ఆడే అవకాశముంటుంది. నెట్ రన్ రేట్ మెరుగుపరచడంపై టీమ్ ఇండియా దృష్టి పెట్టగలదు.

అయితే పాకిస్తాన్‌కు మాత్రం ప్రతి మ్యాచ్ డూ-ఆర్-డైగా మారనుంది. భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం వల్ల సంభావ్య పాయింట్లను కోల్పోయిన పాకిస్తాన్, మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పనిసరిగా మంచి ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్, నమీబియాతో జరిగే మ్యాచ్‌ల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఈ మూడు మ్యాచ్‌లలో పాకిస్తాన్ అన్నింటినీ గెలిస్తేనే సూపర్ 8 ఆశలు నిలుస్తాయి. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిస్తే, అర్హత నెట్ రన్ రేట్‌తో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడం వల్ల ఇప్పటికే నెట్ రన్ రేట్ దెబ్బతిన్న పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. ఒక మ్యాచ్ లేదా అంతకంటే తక్కువ గెలిస్తే, టోర్నమెంట్ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించే ప్రమాదం ఉంది.

గత టీ20 ప్రపంచకప్‌లో యునైటెడ్ స్టేట్స్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అందువల్ల ఈసారి కూడా మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించడం అంత ఈజీ కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రపంచకప్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయం పాకిస్తాన్‌కు భావోద్వేగపరమైన నిర్ణయంగా మారి, క్రీడాపరంగా తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశముంది. మొత్తానికి ఈ నిర్ణయం భారత్‌కు స్పష్టమైన లాభాన్ని అందిస్తుండగా, పాకిస్తాన్ ప్రపంచకప్ ప్రయాణాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది.

Exit mobile version