NTV Telugu Site icon

IND vs USA: భారత్ vs మినీ భారత్.. అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు!

Usa Cricket Team

Usa Cricket Team

8 Indian Players in United States Team: టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్‌-ఏలో ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా.. హ్యాట్రిక్‌ విజయంతో పాటు సూపర్‌-8 బెర్త్‌ కూడా దక్కుతుంది. దాంతో విజయం కోసమే అమెరికా, భారత్ బరిలోకి దిగనున్నాయి. అయితే అమెరికా జట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు ఉండడం విశేషం.

అమెరికా జట్టును మినీ భారత్‌గా భావించవచ్చు. ఎందుకంటే.. యూఎస్ జట్టులో ఏకంగా ఎనిమిది మంది భారత సంతతి ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్థాన్‌తో ఆడిన జట్టులో కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ సహా ఆరుగురు భారతీయులు ఉన్నారు. హర్మీత్ సింగ్, సౌరభ్‌ నేత్రావల్కర్, జస్‌దీప్‌ సింగ్, నోస్తుష ప్రదీప్‌ కెంజిగె, నితీశ్‌ కుమార్‌ కూడా భారత క్రికెటర్లే. భారత్ నుంచి అండర్ 19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కూడా యూఎస్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే అతడు టీ20 ప్రపంచకప్‌ 2024కు ఎంపిక కాలేదు.

Also Read: USA vs IND: నేడు అమెరికాతో మ్యాచ్.. హ్యాట్రిక్‌పై భారత్‌ గురి!

న్యూజీలాండ్ హిట్టర్ కోరే ఆండర్సన్ కూడా ఇప్పుడు అమెరికాకు ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడు టీ20 ప్రపంచకప్‌ 2024లో ఆడుతున్నాడు. అయితే అతడికి ఇంకా చెలరేగే అవకాశం రాలేదు. మోనాంక్‌ పటేల్‌, సౌరభ్‌ నేత్రావల్కర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరిపై యూఎస్ భారీ అంచనాలు పెట్టుకుంది. యుఎస్‌ ఆటగాళ్లు ఒకప్పుడు భారత్‌లో ఆడినవాళ్లే కావడంతో.. భారత్, అమెరికా మ్యాచ్ ఆసక్తిరేపుతోంది. భారత్ vs మినీ భారత్‌గా ఈ మ్యాచ్‌ను భావిస్తున్నారు.