టీ20 ఫార్మాట్లో స్థిరంగా ఆడడం చాలా కష్టం. పొట్టి ఫార్మాట్లో వరుస టోర్నీల్లో భారీ రన్స్ చేయడం అంటే అసాధారణ ప్రతిభ కావాలి. అయితే కొందరు బ్యాటర్లు మాత్రం స్థిరంగా ఆడుతూ పరుగుల వరద పారించారు. ఈ క్రమంలో ముగ్గురు స్టార్ బ్యాటర్లు అరుదైన రికార్డును సృష్టించారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడు సార్లు 200కిపైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, పాతుమ్ నిషాంక మాత్రమే ఉన్నారు.
భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2014, 2016, 2022 ఎడిషన్లలో 200కిపైగా పరుగులు చేశాడు. దాంతో మెగా టోర్నీలలో కింగ్ ఎంత స్థిరంగా ఆడాడో ఇట్టే తెలుస్తోంది. ముఖ్యంగా ఒత్తిడి మ్యాచ్ల్లోనూ విరాట్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాకు అనేక విజయాలు అందించాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 2021, 2022, 2024 టోర్నీల్లో 200+ రన్స్ బాదాడు. పరుగుల వరద పారించిన బట్లర్ ఇంగ్లీష్ జట్టుకు కీలక బ్యాటర్గా నిలిచాడు. అతడి అటాకింగ్ స్టైల్, స్ట్రైక్ రేట్ మ్యాచ్ల గతినే మార్చాయి.
Also Read: 200MP Camera War: 200MP కెమెరా వార్ మొదలు.. మార్చిలో భారీ ఫ్లాగ్షిప్లతో రంగంలోకి రెండు దిగ్గజాలు!
ఇక శ్రీలంక యువ స్టార్ పతుమ్ నిశాంక టీ20 ప్రపంచకప్ 2021, 2022, 2026ల్లో ఈ ఫీట్ సాధించడం విశేషం. తక్కువ కాలంలోనే అతడు ప్రపంచస్థాయి ఆటగాడిగా ఎదిగాడని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ముగ్గురు వేర్వేరు దేశాలకు చెందిన ఈ బ్యాటర్లు ఒకే రికార్డు సాధించడం అరుదనే చెప్పాలి. మొత్తానికి టీ20 వరల్డ్కప్ లాంటి పెద్ద టోర్నీల్లో వరుసగా భారీ రన్స్ చేయడం సాధారణ విషయం కాదు. అందుకే ఈ ముగ్గురు బ్యాటర్లు రికార్డుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
