Suryakumar Yadav: సూరీడికి ఏమైంది?.. 47, 39 పరుగులు తప్ప మెరుపుల్లేవు!

  • సూర్యకుమార్‌ యాదవ్‌కు ఏమైంది?
  • 19 టీ20 ఇన్నింగ్స్‌లో 222 పరుగులు మాత్రమే
  • 47, 39 పరుగులు తప్ప మెరుపుల్లేవు!
Suryakumar Yadav

Suryakumar Yadav

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌కు ‘మిస్టర్ 360’ అని పేరుంది. ఈ ట్యాగ్ ఊరికే రాలేదు. కెరీర్ ఆరంభంలోనే మైదానం నలుమూలలా షాట్స్ ఆడేవాడు. సూర్య క్రీజులోకి వచ్చాడంటేనే.. ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టేది. ఎంత మంచి బంతి వేసినా.. విన్నూత షాట్లతో బౌండరీ లేదా సిక్స్ బాదేవాడు. అయితే కొంతకాలంగా సూరీడి బ్యాటింగ్‌లో మెరుపులు తగ్గాయి. చివరి 19 టీ20 ఇన్నింగ్స్‌లో 222 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు స్ట్రైక్‌ రేట్‌ కూడా 120కి పడిపోయింది. టీ20 ప్రపంచకప్‌ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో సూరీడి ఫామ్ జట్టును ఆందోళన కలిగిస్తోంది.

Also Read: IND vs SA: 16 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ లేదు.. అయినా ఓపెనర్‌గా ఛాన్స్! బెంచ్‌లో సెంచరీల హీరో

ఈ మధ్య కాలంలో సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. గత 19 ఇన్నింగ్స్‌ల్లో 222 రన్స్ మాత్రమే చేశాడు. 19 ఇన్నింగ్స్‌ల్లో 12 సార్లు మూడో స్థానంలో, 7 సార్లు నాలుగో స్థానంలో ఆడాడు. పాకిస్థాన్‌పై 47, ఆస్ట్రేలియాపై 39 పరుగులు తప్ప అన్నింటిలో విఫలమయ్యాడు. ఒక్క హాఫ్‌సెంచరీ కూడా చేయలేకపోయాడు. కటక్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 12 పరుగులకే అవుట్ అయ్యాడు. సూర్య సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. ఈ మధ్య బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో కూడా ఆడుతున్నాడు. ఈ మార్పే సూర్యకుమార్‌ ప్రదర్శన మీద ప్రభావం చూపుతుందని ఫాన్స్, క్రికెట్‌ విశ్లేషకులు అంటున్నారు. సూరీడికి మూడో స్థానంలోనే ఆడించాలని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు.