Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?

  • ఐపీఎల్ 2026 తర్వాత భారత జట్టులో కీలక మార్పులు
  • వన్డే, టీ20 ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌
  • శ్రేయాస్ అయ్యర్‌కు భారత జట్టు బాధ్యతలు
Suryakumar-Gill

Suryakumar-Gill

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ముగిసిన తర్వాత భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే, టీ20 ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ను నియమించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు భారత జట్టు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఐపీఎల్ 2026లో శ్రేయస్ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నారట. దాంతో అతడిని తిరిగి టీ20 జట్టులోకి తీసుకురావడమే కాకుండా.. కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ 2026 అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఇదే సమయంలో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన చేస్తూ.. తన నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. దీంతో వైట్‌బాల్ క్రికెట్‌లో కొత్త కెప్టెన్ కోసం బీసీసీఐ శ్రేయస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బీసీసీఐ వర్గాల ప్రకారం.. ఇకపై టీ20, వన్డే జట్లకు ఒకే నాయకుడిని నియమించాలని బోర్డు భావిస్తోంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూనే అనుభవజ్ఞులను కూడా ప్రోత్సహించే విధంగా జట్టును రూపొందించాలని సెలెక్టర్లు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

‘శ్రేయస్ అయ్యర్ గత కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నాడు. గాయాలు మాత్రమే అతడిని వెనక్కి నెట్టాయి. ఈ సీజన్‌లో తన ఐపీఎల్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. వైట్‌బాల్ కెప్టెన్సీ రేసులో శ్రేయస్ టాప్ కంటెండర్’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. అయితే సూర్యకుమార్ యాదవ్ సేవలను పూర్తిగా పక్కన పెట్టే ఆలోచన బీసీసీఐకి లేదని తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ గెలిపించిన కెప్టెన్‌గా అతడి సేవలను గుర్తిస్తామని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఫామ్, ఫిట్‌నెస్, భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇక గత ఏడాది శుభ్‌మన్‌ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ.. ఇప్పుడు మరోసారి నాయకత్వ మార్పుపై ఆలోచించడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని సరైన నాయకత్వాన్ని ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. భారత జట్టు జూన్ 6న అఫ్ఘనిస్తాన్తో జరిగే ఏకైక టెస్టుతో అంతర్జాతీయ సీజన్‌ను ప్రారంభించనుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అనంతరం జూన్ చివరి వారంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లకే కొత్త వైట్‌బాల్ కెప్టెన్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.