టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-1 సూపర్ 8 మ్యాచ్లో జింబాబ్వేపై ఘన విజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లీగ్ దశలో జరిగిన మ్యాచ్లు, అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగిన గత పోరు గురించి ఎక్కువగా ఆలోచించలేదని.. అన్నింటినీ పూర్తిగా పక్కనపెట్టామని వెల్లడించాడు. జట్టుకు సంబంధించిన ఏడాది ప్రదర్శనను వీడియో అనలిస్ట్ తయారు చేసిన ప్రత్యేక స్లైడ్ను ఆటగాళ్లు చూపించాడని, ఆ వీడియోలు చూసి తాము ఎంతో పాజిటివిటీ పొందామని తెలిపాడు. వీడియోలు చూశాక సానుకూలమైన మైండ్ సెట్తో జింబాబ్వేపై బరిలోకి దిగాం అని సూర్య చెప్పుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఈ మ్యాచ్లో టాప్ ఆర్డర్ నుంచి ఏడో స్థానం వరకూ బ్యాటర్లు అందరూ కలిసి బాధ్యతగా ఆడటం ఆనందంగా అనిపించింది. అయితే మా బౌలింగ్ మాత్రం బాలేదు. మరింత బాగా బంతులు వేయాల్సింది అని నిజాయితీగా అంగీకరిస్తున్నా. అయినప్పటికీ చివరికి విజయం సాధించాం కాబట్టి ఇప్పుడు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి మ్యాచ్ల్లో తప్పిదాలను సరిదిద్దుకుని మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాము’ అని చెప్పాడు.
Also Read: Rinku Singh Father Dead: రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం!
ప్రత్యర్థి జింబాబ్వే బ్యాటర్లను కూడా సూర్య ప్రశంసించాడు. ‘జింబాబ్వే బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలమైనప్పటికీ.. పవర్ప్లేలో ఓపికగా ఆడి తర్వాత తెలివిగా రన్స్ చేశారు. వారి ఆట తీరుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. బౌలింగ్ పరంగా మాత్రం సరైన ఆప్షన్లు ఎంచుకోవడంలో ఇంకాస్త తెలివిగా ఉండాల్సింది. మొత్తానికి జింబాబ్వే మంచి క్రికెట్ ఆడింది. తదుపరి మ్యాచ్ కోసం కోల్కతా చేరుకున్నాక ప్రణాళికల గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతానికి ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని ప్రయాణంపై దృష్టి పెడతాము. కఠిన పరిస్థితుల్లో పాజిటివ్ దృక్పథమే విజయానికి దారి తీస్తుంది’ అని కెప్టెన్ సూర్య స్పష్టం చేశాడు.
