Smriti Mandhana Reveals Her Hardest Night: టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మహిళా క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అద్భుతమైన బ్యాటింగ్తో పాటు నాయకత్వ లక్షణాలతోనూ ఆమె ఎంతోమంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అయితే క్రికెట్ మైదానంలో ఎంత విజయవంతమైన కెరీర్ కొనసాగిస్తున్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని కఠిన పరిస్థితులు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న స్మృతి పలు విషయాలను పంచుకుంది.
మీ జీవితంలో ఎదుర్కొన్న ‘హార్డెస్ట్ నైట్’ గురించి చెప్పాలని స్మృతి మంధానను యాంకర్ రాజ్ షమానీ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మంధాన కొన్ని సెకన్ల పాటు మౌనంగా ఉంది. ఆ ఆసమయంలో భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేసింది. అనంతరం తాను వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడదలుచుకోలేదని, కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడతా స్పష్టం చేసింది. ‘నా జీవితంలో అత్యంత కఠినమైన రాత్రి ఏది అంటే.. వరల్డ్ కప్ కావచ్చు’ అని స్మృతి పేర్కొంది. అయితే ఆమె ఏ వరల్డ్ కప్ లేదా ఏ మ్యాచ్ గురించి మాట్లాడారో మాత్రం వెల్లడించలేదు. కోవిడ్-19 సమయం కూడా తనకు చాలా కష్టంగా అనిపించిందని చెప్పింది.
స్మృతి మంధాన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఓ కీలక పరిణామంపై గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్తో పెళ్లి వరకూ వెళ్లింది. ఆ పెళ్లి అర్ధంతరంగా రద్దు కావడంతో.. కొన్నాళ్లు స్మృతి మానసికంగానూ ఇబ్బంది పడింది. అయితే ఆ విషయంపై ఇప్పటివరకు స్మృతి బహిరంగంగా మాట్లాడలేదు. ఈ పాడ్కాస్ట్లోనూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు ఆమె నేరుగా స్పందించకుండా.. తన క్రికెట్ ప్రయాణం గురించే మాట్లాడటానికి పరిమితమైంది. అయితే ఇప్పుడు ఆ పెళ్లి ఘటన గుర్తుకొచ్చి ఉంటుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
తన క్యారెక్టర్పై కూడా స్మృతి మంధాన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బయటకు చూస్తే తాను కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తిలా కనిపించానని, కానీ తనలో మాత్రం చాలా కోపం ఉంటుందని చెప్పింది. తనతో అనవసరంగా గొడవ పెట్టుకోవద్దంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ‘నేను ఎవరి మీదా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోను. కానీ జరిగిన విషయాలను మాత్రం మర్చిపోను. ఎవరికీ చెడు చేయాలని అనుకోను. నేను మీ దారిలోకి రాకపోతే.. మీరు కూడా నా దారిలోకి రావద్దు’ అనే భావన తనదని మంధాన చెప్పింది. ఎవరైనా మిమ్మల్ని బాధపెడితే వారిని క్షమిస్తారా? అని ప్రశ్నించగా.. ‘నేను క్షమిస్తాను.. కానీ మర్చిపోను’ అని ఆమె స్పష్టం చేసింది. స్మృతి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

