Smriti Mandhana 600 T20I Boundaries Record: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఈ రెండు మ్యాచ్లలో రాణించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 600 బౌండరీలను పూర్తిన తొలి ప్లేయర్గా రికార్డుల్లో నిలిచింది. టీ20 ఫార్మాట్ చరిత్రలో పురుషులు, మహిళల్లో ఈ ఘనత ఇప్పటివరకు ఎవరూ అందుకోలేదు.
600 బౌండరీలు పూర్తి:
ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ 521 బౌండరీలతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక కెప్టెన్ చమరి అతపట్టు 493 బౌండరీలతో మూడో స్థానంలో ఉంది. ఇక పురుషుల క్రికెటర్లలో పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజమ్ 477 బౌండరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐర్లాండ్ హిట్టర్ పాల్ స్టిర్లింగ్ 401 బౌండరీలతో రెండో స్థానంలో ఉండగా.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 383 బౌండరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 361 బౌండరీలు బాదాడు. రోహిత్, క్రిస్ గేల్ లాంటి హిట్టర్లకు సాధ్యం కాని రికార్డును స్మృతి మంధాన అందుకోవడం విశేషం.
స్మృతి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు:
లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 47 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్తో స్మృతి టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 600 బౌండరీలను పూర్తి చేసింది. ఇప్పటికే మహిళల క్రికెట్లో అత్యంత నిలకడైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్మృతి.. ఇప్పుడు టీ20 చరిత్రలో 600 బౌండరీల మైలురాయిని చేరుకుని తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.
భారత్ 95 పరుగుల తేడాతో విజయం:
భారత్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. 114 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 95 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఎన్. శ్రీ చరణి 4 వికెట్లతో చెలరేగగా.. షెఫాలీ వర్మ 3 వికెట్లు తీసి ఆకట్టుకుంది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండో గెలుపును నమోదు చేసి గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

