అక్టోబర్ నెలలో భారత పురుషుల క్రికెట్ జట్టు బిజీ బిజీగా గడపనుంది. ఒకవైపు జపాన్లో జరిగే ఆసియా క్రీడలు 2026లో ఓ భారత జట్టు బరిలోకి దిగనుండగా.. మరోవైపు వెస్టిండీస్తో ఇంకో జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. ఈ రెండు టోర్నీల షెడ్యూల్ ఒకదానితో ఒకటి ఢీకొనడంతో.. టీమిండియా కీలక ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్కు దూరం కానున్నాడు. టీమిండియా టీ20 జట్టుకు సారథిగా ఉన్న సర్పంచ్ సాబ్.. వన్డే జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ టోర్నీలో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. సెప్టెంబర్ 28న క్వార్టర్ ఫైనల్స్, అక్టోబర్ 1న సెమీఫైనల్స్, అక్టోబర్ 3న పతక పోటీలు జరగనున్నాయి. ఈ మ్యాచ్లు జపాన్లోని ఐచి-నగోయాలో జరుగుతాయి. అదే అక్టోబర్ 3న భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే న్యూ చండీగఢ్లో జరగనుంది. ఒకవేళ భారత్ ఆసియా క్రీడల ఫైనల్కు చేరితే.. ఒకే రోజు రెండు వేర్వేరు దేశాల్లో భారత క్రికెట్ జట్లు మ్యాచ్లు ఆడనున్నాయి. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. త్వరలో భారత బృందం జపాన్కు చేరుకోనుంది. ఆసియా క్రీడల బాధ్యతల కారణంగా శ్రేయాస్ వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్కు అందుబాటులో ఉండడు.
శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం భారత వన్డే జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. 2025 అక్టోబర్లో అతడిని వన్డే జట్టు వైస్ కెప్టెన్గా నియమించారు. అయితే ఆసియా క్రీడల కోసం అతడికి కీలక బాధ్యతలు అప్పగించడంతో.. వెస్టిండీస్ సిరీస్లో అతడి సేవలు టీమిండియాకు అందుబాటులో ఉండవు. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులకు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ జట్లతో పాటు మొత్తం భారత బృందం అద్భుతంగా రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల కష్టపడి చేసిన సాధన, సన్నద్ధత, ఉత్సాహాన్ని ప్రస్తావిస్తూ.. భారత్కు బంగారు పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తారనే నమ్మకం ఉందన్నారు.
2026 ఆసియా క్రీడల కోసం భారత పురుషుల క్రికెట్ జట్టు:
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.

