Shreyas Iyer Reaction on India win vs Zimbabwe: జింబాబ్వే పర్యటనను భారత్ విజయంతో ప్రారంభించింది. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేయగా.. భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. తన కెప్టెన్సీలో జట్టు తొలి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు.
మొదటి విజయంతో ఎంతో ప్రత్యేకం:
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘మొదటి విజయంతో చాలా సంతోషంగా ఉంది. మా ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో అద్భుతంగా రాణించారు. ఈ పిచ్పై బౌన్స్ ఉంటుందని మేము ముందుగానే ఊహించాం. ముఖ్యంగా హార్డ్ లెంగ్త్ బంతులకు మంచి బౌన్స్ లభించింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో పిచ్ మరోలా ప్రవర్తించింది. కానీ మా బౌలర్లు పరిస్థితులకు అద్భుతంగా అలవాటు పడ్డారు’ అని తెలిపాడు.
మయాంక్ బౌలింగ్ మ్యాచ్ను మలిచింది:
భారత బౌలర్ల ప్రదర్శనను శ్రేయస్ అయ్యర్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ‘మయాంక్ యాదవ్ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదు. అదే మా విజయానికి పునాది వేసింది. పవర్ప్లేలోనే వైభవ్ సూర్యవంశీ కూడా అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. అతడి షాట్స్ అద్భుతం. ఈ ఇద్దరి ప్రదర్శన మ్యాచ్ను పూర్తిగా మా వైపు తిప్పింది. మయాంక్, వైభవ్ ఆరంభమే మా విజయానికి కారణం’ అని శ్రేయస్ చెప్పాడు.
జింబాబ్వే భాగస్వామ్యాలను బాగా నిర్మించింది:
జింబాబ్వేను మరింత తక్కువ స్కోరుకే కట్టడి చేయలేకపోయారనే ప్రశ్నకు సర్పంచ్ సాబ్ స్పందించాడు. ‘ప్రతి జట్టులో ఒక బ్యాటర్ అయినా చివరి వరకు నిలబడి జట్టుకు పోరాడే స్కోరు అందిస్తాడు. జింబాబ్వే బ్యాటర్లు కూడా పిచ్ స్వభావాన్ని బాగా అర్థం చేసుకుని భాగస్వామ్యాలు నిర్మించారు. అదే సమయంలో నేను మా బౌలర్లను మారుస్తూ అందరికీ అవకాశాలు ఇవ్వాలని భావించాను. ఇంకా ఈ పర్యటనలో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్రతి బౌలర్కు రిథమ్ దొరకడం కూడా చాలా ముఖ్యం’ అని వివరించాడు.
వైభవ్ బ్యాటింగ్ అసాధారణం:
అంతర్జాతీయ క్రికెట్లో తొలి అర్ధ సెంచరీ నమోదు చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. ‘వైభవ్ అసాధారణంగా బ్యాటింగ్ చేశాడు. అతడు ఎలాంటి భయం లేకుండా ఆడే యువ ఆటగాడు. ఈ ఇన్నింగ్స్లో అతడి దూకుడు, ఆత్మవిశ్వాసం అద్భుతంగా కనిపించాయి. వైభవ్ ఇంతకుముందే ఇక్కడ ఆడాడు. అండర్-19 ఫైనల్లో 175 పరుగులు చేసిన అనుభవం ఉంది. అందుకే ఈ పిచ్లపై ఎలా ఆడాలో అతడికి మంచి అవగాహన ఉంది. మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా వైభవ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. ఈ సిరీస్లో ఇంతకంటే మంచి ఆరంభం ఉండదు’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

