భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మంది క్రికెటర్ల కెరీర్లను తీర్చిదిద్దడంలో మహీ కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. తన కెరీర్లో ఎదురైన ప్రతి కష్ట సమయంలోనూ తనకు అండగా నిలిచాడని గుర్తుచేసుకున్నాడు. నాలుగు లేదా ఐదు మ్యాచ్లలో పరుగులు చేయకపోయినా.. అది ఆటగాడి ప్రతిభకు అడ్డంకి కాదని ధోనీ నమ్మేవాడని చెప్పాడు. తక్షణ ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్తులో ఓ ప్లేయర్ జట్టుకు కీలకంగా మారుతాడనే నమ్మకంతో మహీ ఆటగాళ్లను ప్రోత్సహించేవాడని గబ్బర్ చెప్పాడు.
తాజాగా శిఖర్ ధావన్ మాట్లాడుతూ… ఎంఎస్ ధోనీ ఎంతో మంది ఆటగాళ్ల కెరీర్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. నా కెరీర్లో ఉన్నత సమయంలోనే కాదు, కష్ట కాలంలో కూడా అండగా నిలిచాడు. మహీ మద్దతు పొందిన వారిలో నేను ఒక్కడినే కాదు.. చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఒక మ్యాచ్లో విఫలం అయితే.. ఓ ప్లేయర్ విజయవంతం కాలేడని ధోనీ భావించడు. ఓ ఆటగాడిలో ఎంత ప్రతిభ, సామర్థ్యం ఉందో ముందే గుర్తిస్తాడు. 4-5 మ్యాచ్లలో పరుగులు చేయలేకపోయినా.. అది ఆటగాడి కెరీర్కు అడ్డంకి కాకూడదని నమ్ముతాడు. ఆ సమయంలో కూడా ఆటగాడికి నిరంతరం అవకాశాలు ఇవ్వాలని ధోనీ భావిస్తాడు’ అని చెప్పాడు.
Also Read: AP Power Consumption: యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం!
‘ఒక ఆటగాడు మ్యాచ్ను గెలిపించే సామర్థ్యం ఉన్నవాడని ఎంఎస్ ధోనీ నమ్మితే.. అవకాశాలు ఇస్తుంటాడు. 1-2 మ్యాచ్కే ఏ ఆటగాడిని పరిమితం చేయడు. వెంటనే ఫలితం రాకపోయినా భవిష్యత్తులో బాగా రాణిస్తాడని ముందుగానే గుర్తించే దూరదృష్టి ఆయనకు ఉంటుంది. ధోనీ ఆటగాళ్లను ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. అవసరమైతే సూచనలు, సలహాలు కూడా ఇచ్చేవాడు. అందుకే జట్టులో ఎక్కువగా మార్పులు చేసేవాడు కాదు. మహీ భాయ్ నాకు ఎంతో మద్దతు ఇచ్చాడు. అందుకే నేను ఆయనకు రుణపడి ఉంటా’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. ధావన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.