Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ లఖ్నవూ సూపర్ జెయింట్స్తో తన బంధాన్ని తెంచుకున్నాడు. ఇప్పుడు రిషబ్ తన పాత జట్టు దిల్లీ క్యాపిటల్స్ గూటికి తిరిగి చేరుకున్నాడు. దిల్లీ – లఖ్నవూ ఫ్రాంఛైజీల మధ్య జరిగిన ఆటగాళ్ల మార్పిడి (Swap Deal) ఒప్పందంలో భాగంగా ఈ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ స్వాప్ డీల్లో పంత్ దిల్లీకి రాగా.. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దిల్లీ నుంచి లఖ్నవూ సూపర్ జెయింట్స్కు మారాడు. ఈ మెగా డీల్కు సంబంధించిన వివరాలను ఇరు జట్లు తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాల ద్వారా వెల్లడించాయి.
ఈ కొత్త ఒప్పందం కోసం రిషభ్ పంత్ తన జీతంలో భారీ కోతకు అంగీకరించడం గమనార్హం. తాజా డీల్ ప్రకారం దిల్లీ క్యాపిటల్స్ అతడికి రూ.15 కోట్లు చెల్లించనుంది. మరోవైపు లఖ్నవూకు మారిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం తన ప్రస్తుత ఫీజు రూ.13.50 కోట్లనే అందుకోనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ ప్రదర్శన చెప్పుకునే స్థాయిలో లేకపోవడం మన అందరికీ తెలిసిందే. ఈ జట్టు ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం నాలుగింటిలోనే విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పంత్ ఇటీవల కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగాడు. ఇప్పుడు ఏకంగా జట్టునే వీడాడు.
లఖ్నవూలో పంత్ ట్రాక్ రికార్డ్
2025 ఐపీఎల్ మెగా వేలంలో లఖ్నవూ ఫ్రాంఛైజీ పంత్ను ఏకంగా రూ.27 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. అయితే పంత్ నాయకత్వంలో లఖ్నవూ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. రెండు సీజన్లలో కలిపి ఈ జట్టు కేవలం 10 మ్యాచ్ల్లోనే గెలిచింది. 2025 సీజన్లో ఆరు విజయాలు సాధించినప్పటికీ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ పంత్ నిరాశపరిచాడు. గత సీజన్లో 14 మ్యాచ్లలో కేవలం 269 పరుగులే చేసిన పంత్, ఈ ఏడాది సీజన్లో 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు. లఖ్నవూలో తీవ్ర నిరాశకు గురైన పంత్, ఇప్పుడు తన సొంత జట్టు దిల్లీ క్యాపిటల్స్లో పునరాగమనం చేసి మళ్లీ ఫామ్లోకి రావాలని భావిస్తున్నాడు.

