NTV Telugu Site icon

టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించే ఆలోచనలో జడేజా…

భారత స్టార్ ఆల్‌రౌండర్‌ జడేజా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వన్డేలు, టీ20 ఫార్మాట్లలో ఎక్కువ కాలం కెరీర్‌ కొనసాగించడానికి టెస్టులకు వీడ్కోలు పలకాలని జడేజా నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. గత నెలలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో జడేజా మోచేతికి గాయమైంది. అదే కారణంతో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు జడేజాను ఎంపిక చేయలేదు. అయితే …వీలైనంత త్వరగా జడేజాను టెస్టు క్రికెట్లో చూడాలనుకుంటున్న అభిమానులకు అతని నిర్ణయం నిరాశ కలిగించేదిగా ఉంది. మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ ఇండియాకు జడేజా తిరుగులేని ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో రాణిస్తున్న జడేజాకు ఫీల్డింగ్‌లో ఎదురేలేదు.

మెరుపు వేగంతో అతను విసిరిన త్రోలు మ్యాచ్‌లను మలుపు తిప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయ్. ఇప్పటి వరకు 57 టెస్టులాడిన జడేజా 2195 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్‌గానూ జడేజా రికార్డు సృష్టించాడు.