Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!

Rajat Patidar Virat Kohli

Rajat Patidar Virat Kohli

Rajat Patidar Opens Up on Virat Kohli’s Support: ఐపీఎల్‌ 2025 మెగా వేలం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటివరకు దేశవాళీ క్రికెట్‌లో కూడా పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేని పాటిదార్‌కు.. కింగ్ విరాట్ కోహ్లీ నుంచి సారథ్య బాధ్యతలను అప్పగించడం ఆర్సీబీ అభిమానులకు ఆందోళన కలిగించింది. అయితే పాటిదార్ కెప్టెన్సీని కోహ్లీ మొదటి నుంచే సమర్థించాడు. కోహ్లీ మద్దతుతో తనలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని పాటిదార్ తాజాగా వెల్లడించాడు. విరాట్‌ను తాను చిన్నప్పటి నుంచే తన ఆరాధ్య ఆటగాడిగా భావిస్తున్నానని చెప్పాడు.

తాజా ఇంటర్వ్యూలో రజత్ పాటిదార్ మాట్లాడుతూ… ‘మీ ఐడల్‌ మీకు అండగా నిలిస్తే.. అంతకంటే ఇంకేం కావాలి?. మరెవరి మద్దతు కూడా అవసరం ఉండదు. కెప్టెన్సీ విషయంలో విరాట్ నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ప్రత్యేకం. విరాట్ బ్యాటింగ్‌ చేసేటప్పుడు అతడు చేసే ప్రతి విషయాన్ని నేను గమనించేవాడిని. మైదానంలో అతడి తీరు నుంచి.. మైదానం వెలుపల పాటించే రొటీన్‌ వరకు అన్నింటినీ పరిశీలించేవాడిని. కెప్టెన్సీకి నన్ను ఎంపిక చేసే విషయంలో కూడా కోహ్లీ ఎంతో మద్దతు ఇచ్చాడని తెలుసుకున్నా. ఆ సమయంలో నాకు చాలా సంతోషం వేసింది’ అని చెప్పాడు.

ఆర్సీబీ వంటి భారీ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించడం అంత తేలికైన విషయం కాదని రజత్ పాటిదార్ చెప్పాడు. ‘ఆర్సీబీ వంటి ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించడం అంత తేలికైన విషయం కాదు. జట్టుకు కోట్లాది మంది అభిమానులు, భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా నన్ను ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు. నాపై నమ్మకం ఉంచి కెప్టెన్సీ ఇవ్వడం వెనుక విరాట్ కోహ్లీ నాలి ఏదో ప్రతిభను చూసి ఉంటాడు. జట్టులో ఆటగాడిగా ఉన్నా, కెప్టెన్‌గా ఉన్నా విరాట్‌ నుంచి నాకు ఎంతో మద్దతు లభించింది. అందుకు నేను అతడికి చాలా రుణపడి ఉన్నా’ అని పాటిదార్ పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీ నమ్మకానికి రజత్ పాటిదార్ తన కెప్టెన్సీతో మంచి సమాధానం ఇచ్చాడు. 2025లో ఆర్సీబీకి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించి తొలి ఐపీఎల్‌ టైటిల్‌ అందించాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 2026లోనూ ఆర్సీబీ అదే జోరును కొనసాగించింది. గుజరాత్ టైటాన్స్‌పై క్వాలిఫయర్-1తో పాటు ఫైనల్‌లోనూ విజయం సాధించి వరుసగా రెండో ఐపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ మరింత బలమైన జట్టుగా మారింది. 2025, 2026 సీజన్లలో వరుస విజయాలతో ఆర్సీబీ క్రేజ్ మరింత పెరిగింది. 2027లో మూడోసారి టైటిల్‌ గెలిచి హ్యాట్రిక్‌ సాధించిన తొలి జట్టుగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.