ఐపీఎల్ 2026 సీజన్ ముందు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమానులకు శుభవార్త. కొంతకాలంగా వెన్ను గాయంతో (బ్యాక్ ఇంజరీ) ఇబ్బందిపడుతున్న ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేగంగా కోలుకుంటున్నాడు. మార్చి 25న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన జట్టు ట్రైనింగ్ సెషన్లో కమిన్స్ పాల్గొన్నాడు. ఇది అభిమానులకు ఊరటనిచ్చే అంశం. తాను వేగంగా కోలుకుంటున్నానని, 2026 ఐపీఎల్ మధ్యలో జట్టులోకి వస్తానని కమిన్స్ చెప్పాడు. అంతా అనుకున్నట్లు జరిగితే తాను టోర్నీ రెండో భాగం, ఫైనల్స్లో మైదానంలోకి దిగుతానని చెప్పుకొచ్చాడు.
బ్యాక్ ఇంజరీ సమస్యతో బాధపడుతున్న పాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ ట్రైనింగ్లో తేలికపాటి వర్కౌట్కే పరిమితమయ్యాడు. వార్మప్ ఎక్సర్సైజ్లు, ఫీల్డింగ్, క్యాచింగ్ డ్రిల్స్లో పాల్గొన్నాడు. అలాగే తక్కువ రన్అప్తో కొన్ని బంతులు వేసి తన బౌలింగ్ రిథమ్ను తిరిగి అందుకోవడానికి ప్రయత్నించాడు. ఇది కమిన్స్ రికవరీ సానుకూల దిశలో సాగుతున్నట్లు సూచిస్తోంది. ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే కెప్టెన్ అయిన కమిన్స్.. గత ఏడాది నుంచి గాయాల కారణంగా కీలక మ్యాచ్లకు దూరమయ్యాడు. వెస్టిండీస్ టూర్ అనంతరం లంబార్ స్ట్రెస్ ఇంజరీ కారణంగా చాలా కాలం క్రికెట్కు దూరమయ్యాడు. డిసెంబర్లో ఇంగ్లాండ్పై అడిలైడ్ టెస్ట్ మాత్రమే ఆడగా.. ఇటీవల టీ20 వరల్డ్ కప్లో కూడా ఆడలేదు.
Also Read: Vaani Kapoor: టూ పీస్ అవుట్ ఫిట్లో రచ్చ.. సమ్మర్ను మరింత హీట్ ఎక్కిస్తోన్న వాణీ!
ఐపీఎల్ 2026 గురించి పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. తాను ప్రారంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండబోనని స్పష్టం చేశాడు. అయితే టోర్నమెంట్ మధ్యలో తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రతి మూడు రోజులకు ఒకసారి బౌలింగ్ చేస్తూ ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నానని తెలిపాడు. ప్లాన్ ప్రకారం మిడ్ సీజన్ నాటికి మైదనంలోకి దిగుతా అని ధీమా వ్యక్తం చేశాడు. కమిన్స్ గైర్హాజరీలో సన్రైజర్స్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రారంభ మ్యాచ్ల్లో కిషన్ నాయకత్వం కీలకంగా మారనుంది.