Site icon NTV Telugu

Team India: సెంచరీలతో చెలరేగిన స్మృతి, ప్రతీక.. సెమీస్‌ బెర్తు ఖరారు!

Team India

Team India

Team India: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత టీమిండియా విజయం సాధించింది. 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సెమీస్‌లోకి అడుగు పెట్టేసింది. వర్షం వల్ల డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఫలితం తేలిన మ్యాచ్‌లో 44 ఓవర్లలో 325 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 8 వికెట్లకు 271 పరుగులే చేసింది. ఆ జట్టులో బ్రూక్‌ హాలిడే (81 ), ఇసబెల్లా గేజ్‌ (65), అమేలియా కెర్‌ (45) పోరాటం చేసినప్పటికీ ఫలితం రాలేదు. టీమిండియా బౌలర్లలో రేణుక సింగ్‌, క్రాంతి గౌడ్‌ తలో రెండు వికెట్లు తీసుకోగా ప్రతీక రావల్‌ ఒక్క వికెట్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు ప్రతీక రావల్‌ (122), స్మృతి మంధాన (109) సెంచరీలకు తోడు జెమీమా రోడ్రిగ్స్‌ (76 నాటౌట్‌) మెరుపులు తోడవడంతో టీమిండియా నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది.

Read Also: US vs India: చైనా లాగే భారత్ కూడా రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంది..

అయితే, లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ బాగా బ్యాటింగ్‌ చేసినప్పటికీ.. సాధించాల్సిన టార్గెట్ పెద్దది కావడంతో ఆ జట్టు ఏ దశలోనూ గెలుపు రేసులో నిలవలేకపోయింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే క్రాంతి గౌడ్.. సుజీ బేట్స్‌ (1)ను ఔట్‌ చేయడంతో కివీస్‌ ఇన్సింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. ఇక, జార్జియా ప్లిమ్మర్‌ (30), అమేలియా నిలకడగా ఆడుతూ జట్టును ముందుకు నడిపించారు. కానీ, ప్లిమ్మర్, కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (6) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ బాట పట్టడంతో కివీస్‌ తీవ్ర నష్టాల్లో పడింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న బ్రూక్‌ హాలిడే.. అమేలియా, ఇసబెల్లా గేజ్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పింది. అలాగే, ఈ ముగ్గురి పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే మాత్రమే ఉపయోగపడింది.

Read Also: Bus Fire Accident: డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు ప్రమాదంపై ప్రయాణికుడి కీలక వ్యాఖ్యలు..

కాగా, న్యూజిలాండ్‌పై విజయంతో భారత్‌కు సెమీస్‌ బెర్తు ఫిక్స్ అయిపోయింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే తన చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌సేన.. బంగ్లాదేశ్‌తో పోటీ పడనుంది. అదే రోజు ఉదయం 11 నుంచి ఇంగ్లాండ్‌తో కివీస్‌ తలపడబోతుంది. ఈ మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్‌ ముందుకు వెళ్లింది. ఆ రోజు బంగ్లా చేతిలో భారత్‌ ఓడి, ఇంగ్లీష్ జట్టుపై కివీస్‌ గెలిస్తే ఇరు జట్ల పాయింట్లు సమం అవుతాయి. ఒకవేళ నెట్‌ రన్‌రేట్‌లో టీమింయాను అధిగమించినా కివీస్‌ సెమీస్ కు వెళ్లలేదు. ఎందుకంటే, భారత్‌ ఖాతాలో ఎక్కువ విజయాలు ఉండటం.. కివీస్‌ వర్షంతో రద్దైన రెండు మ్యాచ్‌ల ద్వారా 2 పాయింట్లు దక్కించుకుంది. కాబట్టి ఇంగ్లాండ్‌ను ఓడించి పాయింట్లలో భారత్‌ను సమం చేసినా, విజయాల్లో వెనుకబడడంతో న్యూజిలాండ్ సెమీస్‌ చేరదు. ఇక, టాప్‌-3లో ఉన్న 3 జట్లూ ఇప్పటికే 9 కంటే ఎక్కువ పాయింట్లతో ఉన్నాయి.. కావునా, భారత్‌ తన చివరి మ్యాచ్‌లో గెలిచినా 8 పాయింట్లే సాధిస్తుంది. కాబట్టి నాలుగో స్థానంతోనే సెమీస్‌కు వెళ్తుంది. మొదటి స్థానంలో నిలిచే జట్టుతో టీమిండియా సెమీస్‌ ఆడుతుంది.

Exit mobile version