NTV Telugu Site icon

IPL 2022: ఈ ఏడాది రెండు గ్రూపులు.. కొత్త ఫార్మాట్‌లో మ్యాచ్‌లు

ఐపీఎల్ 15వ సీజన్ కోసం కొత్త ఫార్మాట్‌ను నిర్వాహకులు అమలు చేయబోతున్నారు. ఈ ఏడాది జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించేందుకు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కానీ ఎప్పటిలాగే గ్రూప్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది. కొత్త ఫార్మాట్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. గ్రూప్‌-ఎలో ముంబై, కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గ్రూప్-బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లు ఉన్నాయి.

ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల ఆధారంగా నంబర్లు కేటాయించారు. ఒక జట్టు అదే గ్రూప్‌లోని మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని జట్లతో ఒక మ్యాచ్ ఆడనుంది. అలాగే టేబుల్‌లో పక్కన ఉన్న టీంతో మరో మ్యాచ్ (1+1) ఆడుతుంది. ఈ లెక్కన ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది.
ఉదాహరణకు ముంబై ఇండియన్స్ జట్టు గ్రూప్-ఎలో ఉన్నందున.. అదే గ్రూప్‌లోని కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో టీమ్‌లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అలాగే గ్రూప్-బిలోని హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లతో ఒక్కో మ్యాచ్‌తో పాటు పక్కనే ఉన్న చెన్నైతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 26న ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి.