MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!

Ms Dhoni Ipl Retirement

Ms Dhoni Ipl Retirement

MS Dhoni Unlikely to Play in IPL 2027: టీమిండియా దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే 45 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ.. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆటగాడిగా కొనసాగుతాడా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఐపీఎల్ 2027లో అభిమానులు ధోనీని ఆటగాడిగా చూడటం కష్టమే. ధోనీ వచ్చే సీజన్‌లో ఆటగాడిగా బరిలోకి దిగకపోవచ్చని రోహిత్ జుగ్లాన్ పేర్కొన్నాడు.

అయితే ఎంఎస్ ధోనీ పూర్తిగా సీఎస్‌కేకు దూరమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఆటగాడిగా కాకుండా జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. ధోనీ ఏ హోదాలో సీఎస్‌కేతో కొనసాగుతాడనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. మెంటార్‌గా లేదా జట్టులో మరింత కీలకమైన బాధ్యతల్లో అతడిని కొనసాగించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్‌లో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయి. చాలా ఏళ్లుగా హెడ్ కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో సీఎస్‌కే బంధం ముగిసింది. దీంతో వచ్చే సీజన్‌కు కొత్త హెడ్ కోచ్‌ రానున్నాడు. కొత్త కోచ్ రాకతో జట్టు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ వ్యవస్థలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మార్పులన్నీ పూర్తయిన తర్వాతే ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటగాడిగా ధోనీ రిటైర్ అయితే సీఎస్‌కేకు అతడి అనుభవం ఎంతో ఉపయోగపడనుంది. కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన ధోనీకి డ్రెస్సింగ్ రూమ్‌లోనే కాకుండా ఫ్రాంచైజీ నిర్ణయాల్లోనూ అపారమైన అనుభవం ఉంది. అందువల్ల మెంటార్ లేదా సపోర్ట్ స్టాఫ్‌లో కీలక వ్యక్తిగా అతడిని కొనసాగించే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతం సీఎస్‌కే కొత్త కోచ్ నియామకంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త కోచ్ ఎవరు అనేది తేలిన తర్వాత ఎంఎస్ ధోనీని ఏ పాత్రలో కొనసాగించాలనే అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చే సీజన్ వేలానికి ముందు రిటెన్షన్స్, ట్రేడ్స్, ఆటగాళ్ల విడుదల వంటి అంశాల్లో సీఎస్‌కేలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్ 2027లో ధోనీ ఆటగాడిగా కనిపించే అవకాశాలు చాలా చాలా తక్కువ. అయితే అతడు సీఎస్‌కేతో ఏదో ఒక కీలక పాత్రలో కొనసాగుతాడా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ధోనీ అభిమానులు మాత్రం తమ అభిమాన ఆటగాడిని మరోసారి మైదానంలో చూడాలని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.