తెలుగు రాష్ట్రాలకు భారీ ఊరట. మరో భారీ ఎల్పీజీ గ్యాస్ నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. ఇటీవలి కాలంలో గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది కొంత ఉపశమనాన్ని అందించనుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చిన ‘పైన్ గ్యాస్’ ట్యాంకర్ సుమారు 47 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ను మోసుకొచ్చింది. ఈ భారీ నిల్వలు రాష్ట్రాల్లో పెరుగుతున్న గ్యాస్ డిమాండ్ను తీర్చడంలో కీలకంగా మారనున్నాయి. గ్యాస్ సరఫరా సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ గ్యాస్ నౌక అసలు ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ డిమాండ్ అధికంగా ఉండటం, నిల్వలు తగ్గిపోవడం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నౌకను విశాఖపట్నం పోర్టుకు మళ్లించినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యాస్ సరఫరా కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగదారులు, వాణిజ్య రంగానికి ఇది తక్షణ ఉపశమనాన్ని కలిగించే అవకాశముంది.