Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!

  • యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్
  • ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్‌పై ఒత్తిడి
  • జైస్వాల్ ప్రభావం ఇప్పుడు పెద్దగా లేదు
Vaibhav Vs Yashasvi Jaiswal

Vaibhav Vs Yashasvi Jaiswal

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను చితక్కొడుతున్న ఈ బుడ్డోడిపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. వైభవ్ కేవలం సిక్సర్లు కొట్టడమే కాదు.. రెండు నెలలుగా నిలకడగా రాణిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడని కుంబ్లే పేర్కొన్నాడు. వైభవ్ అద్భుత ఫామ్ కారణంగా ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్‌పై కూడా ఒత్తిడి పెరిగిందని అభిప్రాయపడ్డాడు. జైస్వాల్ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 426 పరుగులు చేశాడు. 153.24 స్ట్రైక్ రేట్, 32.77 సగటుతో పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే 65 సిక్సర్లు బాది ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. గతంలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్‌ల్లో 242.86 స్ట్రైక్ రేట్‌తో 680 పరుగులు చేసిన వైభవ్.. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీనేజర్‌గా ప్రపంచ రికార్డు కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. నేడు గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్థాన్ క్వాలిఫయర్‌-2 మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్ ‘గేమ్ ప్లాన్’ కార్యక్రమంలో అనిల్ కుంబ్లే మాట్లాడాడు.

×
×
Ad

‘వైభవ్ సూర్యవంశీ కేవలం 1-2 మ్యాచ్‌ల్లో కాదు.. గత రెండు నెలలుగా అద్భుతంగా ఆడుతున్నాడు. అదే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. కేవలం వచ్చి కొన్ని సిక్సర్లు కొట్టడం మాత్రమే కాదు.. జట్టుకు అవసరమైన సమయంలో బాధ్యతగా బ్యాటింగ్ చేస్తున్నాడు’ అని ప్రశంసించాడు. వైభవ్ అద్భుత ఫామ్ ఇప్పుడు యశస్వి జైస్వాల్‌పై ప్రభావం చూపుతోందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. “కొన్ని సంవత్సరాల క్రితం యశస్విపైనే అందరి దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు వైభవ్ తన ఆటతో ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తున్నాడు. దీంతో జైస్వాల్‌పై కూడా సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. అతడు ధాటిగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌ను ఉదాహరణగా చెబుతూ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్-జైస్వాల్ భాగస్వామ్యం అద్భుతంగా సాగింది. ఇద్దరూ కలిసి ఎనిమిది ఓవర్లలో దాదాపు 120 పరుగులు జోడించారు. కానీ అందులో ఎక్కువ స్కోర్ చేసింది వైభవ్‌నే. అంత మంచి బ్యాటింగ్ పిచ్‌పై జైస్వాల్ రన్-ఎ-బాల్ ఆడడం అతడికి నిరాశ కలిగించి ఉంటుంది. జైస్వాల్ ప్రభావం ఇప్పుడు పెద్దగా లేదు. అందరూ ఇప్పుడు వైభవ్ వైభవ్ అంటున్నారు’ అని అన్నాడు. జైస్వాల్ స్ట్రైక్‌రేట్ 153.24గా ఉన్నప్పటికీ.. వైభవ్ దూకుడు కారణంగా అతడి ప్రదర్శన వెలుగులోకి రాకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.