Shubman Gill About Gujarat Titans Loss To RCB in IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)కు భారీ షాక్ తగిలింది. మంగళవారం రాత్రి ధర్మశాల వేదికగా జరిగిన కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో నేరుగా ఫైనల్కు వెళ్లే అవకాశాన్ని జీటీ చేజార్చుకుంది. క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్లో చేసిన తప్పులు జట్టును తీవ్రంగా దెబ్బతీశాయని కెప్టెన్ శుభ్మన్ గిల్ అంగీకరించాడు. ఫీల్డింగ్ తమ కొంపముంచిందని చెప్పాడు. ఈ మ్యాచ్ను త్వరగా మర్చిపోవాలని, మోహాలీలో కొత్త ఆరంభం చేయాలని చూస్తున్నాం అని గిల్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్మన్ గిల్.. ‘మేము 12వ, 13వ ఓవర్ వరకు బాగానే ఉన్నాం. ఆ తర్వాతే అంతా మారిపోయింది. మా ఫీల్డింగ్ స్థాయికి తగ్గట్టుగా లేదు. కొన్ని కీలక క్యాచ్లు వదిలేశాం. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా నిరాశపరిచింది. ఆ తప్పులే మ్యాచ్ను మాకు దూరం చేశాయి’ అని తెలిపాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్లను జీటీ ఫీల్డర్లు రెండుసార్లు వదిలేశారు. దాంతో అతడు 39 బంతుల్లో 93 పరుగులతో చెలరేగిపోయాడు. మరోవైపు కొన్ని బౌండరీలు కూడా గుజరాత్ ఫీల్డర్లు ఆపలేకపోయారు. దాంతో అదనపు రన్స్ వచ్చాయి.
‘ఇలాంటి మ్యాచ్లను త్వరగా మర్చిపోయి ముందుకు వెళ్లాలి. ఇప్పుడు మోహాలీలో కొత్త ఆరంభం చేయాలని చూస్తున్నాం. ఫీల్డింగ్ లోపాలను సరిచేసేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మేము ఇప్పటికే టీమ్ మీటింగ్స్లో, ప్రాక్టీస్ సెషన్లలో ఈ విషయాలను చర్చిస్తూనే ఉంటాం. కానీ ఈరోజు మా రోజు కాదు. జట్టులో ఇంటెన్సిటీ ఉంది. అయితే ఒత్తిడి పరిస్థితుల్లో మేము మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. ఈ గ్రౌండ్లో పవర్ప్లే రన్స్ చేస్తే ఎంతటి టార్గెట్నైనా ఛేజ్ చేయవచ్చు. ఇక్కడ బంతి బాగా వస్తోంది. అవుట్ఫీల్డ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి మంచి ఆరంభం లభించి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదేమో. పవర్ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఆ సమయంలో ఏడుపొచ్చినంత పనైంది’ అని శుభ్మన్ గిల్ భావోద్వేగానికి గురయ్యాడు.
స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన తీరు గురించి కూడా గుజరాత్ కెప్టెన్ గిల్ స్పందించాడు. ‘అలాంటి డిస్మిసల్ చాలా అరుదుగా చూస్తాం. అది నిజంగా దురదృష్టకరం’ అని అన్నాడు. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ అనూహ్యరీతిలో ఔటవ్వడం జీటీ ఛేదనపై ప్రభావం చూపింది. ఇప్పటికే ఫైనల్కు చేరుకున్న ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ దిశగా దూసుకెళ్తుండగా.. గుజరాత్ టైటాన్స్ మాత్రం ఇప్పుడు క్వాలిఫయర్-2పై ఫోకస్ పెట్టింది. ఈ ఓటమి నుంచి త్వరగా కోలుకుని మరోసారి బలంగా తిరిగి రావాలని జీటీ లక్ష్యంగా పెట్టుకుంది.
