Site icon NTV Telugu

MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్‌ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్‌ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు భారత్ యువ సెన్సేషన్‌ వైభవ్‌ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అతడు ఎదుర్కొనేది.. టీమిండియా పేసు గుర్రం, ప్రపంచ టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను. సునాయాసంగా సిక్సులు బాదే వైభవ్‌.. బుమ్రా బౌలింగ్‌లో ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నేపథ్యంలో ముంబై బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే మాట్లాడుతూ..వైభవ్‌ ఆట తమకు కొత్తేం కాదని, అతడి కోసం ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయని చెప్పాడు.

ఎంఐ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మాట్లాడుతూ… ‘వైభవ్ సూర్యవంశీ కొత్త ఆటగాడు కాదు. ఇది అతని రెండో ఐపీఎల్ సీజన్. వైభవ్ మంచి ప్లేయర్ అని మాకు తెలుసు. రాజస్థాన్ ఫ్రాంచైజీకి అత్యంత విలువైన ఆటగాడు. అతడి ఆటతీరు మాకు కొత్త కాదు. వైభవ్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అసవరం లేదు. మేము ఇతర ఆటగాళ్లలా అతనికీ ప్రత్యేకంగా ప్లాన్ చేశాం. త్వరగానే అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని చెప్పాడు.

Also Read: Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

ఈ మ్యాచ్‌లో ప్రధానంగా అందరి దృష్టి వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా పోరుపై ఉంది. బుమ్రా గురించి మాంబ్రే మాట్లాడుతూ.. ‘బుమ్రా బౌలింగ్‌లో ఉన్న ప్రత్యేకత అతని డెలివరీలు. బ్యాటర్ ఊహించని బంతులు వేస్తుంటాడు. బ్యాట్స్‌మన్ ఏం ఆలోచిస్తున్నాడో అంచనా వేసి.. బంతిని సంధిస్తాడు. అదే అతని ప్రధాన బలం’ అని వివరించాడు. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. ఆ తర్వాత అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులతో అదరగొట్టాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో 52, 31 పరుగులు చేసి దూకుడు చూపించాడు. ఆర్ఆర్ జట్టుకు వైభవ్ కీలక ఆటగాడిగా మారాడు.

Exit mobile version