Riyan Parag: అమ్మో వైభవ్‌ను అస్సలు టచ్ చేయం.. రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం
  • క్వాలిఫయర్-2కు అర్హత సాధించిన ఆర్ఆర్
  • వైభవ్‌ను అస్సలు టచ్ చేయం అంటున్న పరాగ్
Riyan Parag Reaction

Riyan Parag Reaction

Riyan Parag Reveals RR’s Special Approach For Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్)పై అద్భుత విజయాన్ని సాధించిన రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్ (97; 29 బంతుల్లో 5×4, 12×6) మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేసింది. ఆపై జోఫ్రా ఆర్చర్ (3/58) ఎస్ఆర్‌హెచ్ నడ్డి విరిచాడు. మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తూనే.. ఇంకా మెరుగుపడాల్సిన అంశాల గురించి కూడా మాట్లాడాడు.

‘మొత్తంగా మేము మంచి మ్యాచ్ ఆడాం. కానీ నేను ఎప్పుడూ పర్ఫెక్షన్ కోరుకుంటాను. పూర్తిగా పర్ఫెక్ట్ గేమ్ ఆడటం సాధ్యం కాకపోయినా.. ఈరోజు మేము 260 పరుగులు చేయాల్సింది. వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన ఆరంభాన్ని చివరి వరకు ఎలా తీసుకెళ్లాలో మా బ్యాటర్లు ఇంకా నేర్చుకోవాలి. బౌలింగ్ విషయంలో మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ కొన్ని మంచి బౌండరీలు కొట్టిన తర్వాత కూడా మా బౌలర్లు ప్రశాంతంగా ఉన్నారు. ఒత్తిడిని బాగా హ్యాండిల్ చేశారు. మొత్తంగా ఇది మంచి జట్టు ప్రదర్శన. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని రియాన్ పరాగ్ చెప్పాడు.

వైభవ్ సూర్యవంశీతో ఎలాంటి సంభాషణలు చేస్తారనే ప్రశ్నకు రియాన్ పరాగ్ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. ‘మేము వైభవ్‌తో పెద్దగా మాట్లాడం. అతడిని ఫ్రీగా వదిలేస్తాం. సరదాగా ఆడనిస్తాం. వైభవ్‌కు బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే నెట్స్‌లో ఎక్కువగా బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇస్తాం. మైదానంలో తన పని తాను చేసేస్తాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. సిక్సులు కొడుతుంటే అందరం ఎంజాయ్ చేశాం. వైభవ్ వల్లే ఈ భారీ స్కోర్, విజయం సాధ్యమైంది’ అని పరాగ్ తెలిపాడు. ‘ఇటీవల ఆడిన మ్యాచ్‌లు కూడా నాకౌట్ తరహాలో ఉన్నాయని చెప్పొచ్చు. కానీ నిజానికి సీజన్ మొత్తం మా ఆటగాళ్లు ఇదే ఎనర్జీతో ఆడారు. ప్రతి మ్యాచ్‌ను కీలకంగానే తీసుకున్నారు. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం ఇంకాస్త ఎక్కువగా కష్టపడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటగాళ్లలోని అసలు ఫైటింగ్ స్పిరిట్ బయటకు వస్తుంది’ అని చెప్పాడు.

జోఫ్రా ఆర్చర్ గురించి మాట్లాడుతూ.. పరాగ్ సరదా సంఘటనను పంచుకున్నాడు. ‘జోఫ్రాతో మేము ఎప్పుడూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అభిషేక్ శర్మకు వేసిన తొలి బంతికి దాదాపు క్యాచ్ వచ్చేది కానీ.. అది వైడ్ అయింది. అప్పుడు నేను జోఫ్రా దగ్గరికి వెళ్లి.. కొంచెం స్ట్రెయిట్‌గా వేయ్ అన్నాను. తర్వాత అతడు వికెట్ తీసి నవ్వుతూ నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఉందా? అని అడిగాడు. జోఫ్రా ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ బౌలర్లలో ఒకడు. 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న బౌలర్‌కు ఎక్కువ సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే చిన్న రిమైండర్ ఇస్తాం అంతే. రేపు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాం. ఈరోజు అందరికీ బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. అందరూ మంచి రిథమ్‌లో ఉన్నారు. నేను కూడా విశ్రాంతి తీసుకుంటాను. ప్రాక్టీస్ చేయను. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై దృష్టి పెడతాం’ అని చెప్పాడు. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత విజయంతో ఉత్సాహంగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు క్వాలిఫయర్-2లో టైటాన్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. వైభవ్ ఫామ్, జోఫ్రా స్పీడ్, పరాగ్ నాయకత్వం జట్టుకు భారీ బలాలుగా కనిపిస్తున్నాయి.