Rishabh Pant Reacts After LSG Loss To RR: ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టోర్నీలో తమ పరిస్థితి ఎలా ఉన్నా.. లక్నో గొప్ప జట్టు అని పేర్కొన్నాడు. తమ జట్టులో మ్యాచ్ గెలిపించే సామర్థ్యం అందరిలో ఉందని చెప్పాడు. ఫలితాలు అనుకూలంగా రాకపోతే.. తాము బలహీన జట్టు కాదన్నాడు. ఆటగాళ్లుగా, జట్టుగా తమకెప్పుడూ తమపై నమ్మకం ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు. తాము తోపులం అని, కానీ ఈ సీజన్ అంతగా కలిసి రాలేదని పంత్ చెప్పుకొచ్చాడు.
జైపూర్లో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 220 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ.. బౌలర్లు ఆ లక్ష్యాన్ని కాపాడలేకపోయారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషభ్ పంత్.. ఈ వికెట్పై మరో 5-10 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేసి తమను కట్టడి చేశాడని పేర్కొన్నాడు. ‘ఈ పిచ్పై 220 మంచి స్కోరే అయినా మా ఆరంభాన్ని బట్టి చూస్తే ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. మధ్య ఓవర్లలో, ముఖ్యంగా చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ దశలో మేము మరింత దూకుడుగా ఆడి ఉంటే మరో 5 లేదా 10 పరుగులు అదనంగా వచ్చేవి. అదే మ్యాచ్లో తేడా తీసుకొచ్చేది’ అని పంత్ చెప్పాడు.
ఇంత భారీ స్కోర్ను కూడా కాపాడలేకపోవడం గురించి మాట్లాడిన రిషభ్ పంత్.. ‘ఇలాంటి బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్పై బౌలర్లకు ఏమీ చేయడనికి ఉండదు. అయినప్పటికీ కెప్టెన్గా నేను ఎప్పుడూ బౌలర్లకు మద్దతుగా ఉంటాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సూచనలు ఇవ్వడం కంటే సింపుల్ ప్లాన్తో ఒక్కో బంతిపై దృష్టి పెట్టి అమలు చేయడం ముఖ్యం. ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు ఉండటంతో వెంటనే ఎడమచేతి స్పిన్నర్ను బౌలింగ్కు తీసుకురావాలనుకోలేదు. అందుకే షహబాజ్ అహ్మద్కు ఆలస్యంగా బంతిని ఇచ్చా. దిగ్వేశ్ రాఠీ ఉండటంతో రిస్క్ తీసుకోవద్దని భావించాం. అందుకే అహ్మద్కు చివర్లో బౌలింగ్కు తీసుకొచ్చాం’ అని వివరించాడు
జట్టులో మహ్మద్ షమీ వంటి అనుభవజ్ఞుడి లేకపోవడం ఎంత ప్రభావం చూపిందన్న ప్రశ్నకు పంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘అనుభవం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఏళ్ల తరబడి ఆడితేనే వస్తుంది. ఒత్తిడి పరిస్థితుల్లో అనుభవం చాలా కీలకం. అలాంటి ఆటగాళ్లు జట్టులో ఉంటే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. షమీ వంటి బౌలర్ లేకపోవడం ఖచ్చితంగా మిస్ అవుతాము. ప్రస్తుతం మా పరిస్థితి ఎలా ఉన్నా.. మేం గొప్ప జట్టమే. మా జట్టులో మ్యాచ్ గెలిపించే సామర్థ్యం ఉంది. ఫలితాలు మా వైపు రాలేదు’ అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
