Rajat Patidar Gives Big Update on Phil Salt injury: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ కీలక మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ తుది జట్టుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్కు ఎవరు వస్తారు? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా లీగ్ దశలో చాలా మ్యాచ్లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జేకబ్ బెతెల్కు అవకాశాలు లభించినా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై వెంకటేశ్ అయ్యర్ ఓపెనర్గా బరిలోకి దిగి దూకుడైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో క్వాలిఫయర్-1లో ఫిల్ సాల్ట్ను తిరిగి జట్టులోకి తీసుకువస్తారా? లేదా అయ్యర్కే అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ విషయంపై క్వాలిఫయర్-1 మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ స్పందించాడు. ఫిల్ సాల్ట్ ప్రస్తుతం ఫిట్గా ఉన్నాడని, ప్రాక్టీస్ సెషన్లో డ్రిల్స్ చేస్తున్నాడని తెలిపాడు. అయితే ఫైనల్ ప్లేయింగ్ ఎలెవన్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. పిచ్ను చూసిన తర్వాత తుది జట్టు ఎంపిక ఉంటుందని చెప్పుకొచ్చాడు. సాల్ట్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ మేనేజ్మెంట్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026లో భారీ స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో బౌలర్ల పరిస్థితిపై కూడా పాటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుతం బౌలర్లకు చాలా ఛాలెంజింగ్ పరిస్థితులు ఉన్నాయి. పిచ్లు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటున్నాయి. బౌండరీలు చిన్నవిగా ఉన్నాయి. పైగా డ్యూ కూడా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు చిన్న తప్పు చేసినా అది సిక్సర్గా వెళుతోంది. మాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటికి తగ్గట్టే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని పాటీదార్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2026 ఫైనల్ను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు మార్చిన అంశంపై కూడా ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ స్పందించాడు. అయితే ఈ వివాదంపై ఎక్కువగా మాట్లాడకుండా.. ‘అది నా చేతుల్లో లేదు. ఫైనల్ ఎక్కడ జరిగినా అక్కడే ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం ఫైనల్ చేరడంపైనే ఉంది’ అని స్పష్టం చేశాడు. లీగ్ దశను ఆర్సీబీ, జీటీ జట్లు సమాన పాయింట్లతో ముగించడంతో క్వాలిఫయర్-1 పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ‘రెండు జట్లు ఈ సీజన్లో అద్భుతంగా ఆడాయి. మ్యాచ్ రోజు ఎవరు తమ ప్రణాళికలను మెరుగ్గా అమలు చేస్తారో.. ఒత్తిడిని బాగా ఎదుర్కొంటారో వారే గెలుస్తారు’ అని పాటీదార్ అభిప్రాయపడ్డాడు.
ఆర్సీబీ తుది జట్టు (అంచనా):
రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్/వెంకటేశ్ అయ్యర్, దేవ్దత్ పడిక్కల్, జితేశ్ శర్మ, రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్, హేజిల్వుడ్, రసిఖ్ సలామ్.
