ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో జరిగిన మ్యాచ్లో ఓటమి అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తగినంత స్కోర్ చేయలేకపోయిందని అంగీకరించిన పాటీదార్.. బౌలర్లు చివరివరకు పోరాడిన తీరు పాజిటివ్గా భావిస్తున్నానని తెలిపాడు. పాయింట్ల పట్టికపై కాకుండా.. ప్రతి మ్యాచ్పై దృష్టి పెట్టాలని తాము నిర్ణయించుకుందని తెలిపాడు. జీటీ బ్యాటర్ శుభ్మన్ గిల్ పవర్ప్లేలో అద్భుతంగా ఆడాడని, అక్కడే తాము వెనకపడిపోయాం అని పాటీదార్ చెప్పుకొచ్చాడు.
‘నిజంగా చెప్పాలంటే ఈ పిచ్పై మా స్కోర్ సరిపోలేదు. కానీ మేము బౌలింగ్ చేసిన తీరు బాగుంది. మ్యాచ్ను 15-16 ఓవర్ల వరకు తీసుకెళ్లడం మాత్రం మాకు పాజిటివ్ అనే చెప్పాలి. పిచ్పై పచ్చిక బాగా ఉండటంతో మొదట ఫాస్ట్ బౌలర్లకు సహకారం లభించింది. శుభ్మన్ గిల్ పవర్ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు మా మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినప్పటికీ మేము తిరిగి పోరాడి మ్యాచ్ను 16వ ఓవర్ల వరకు తీసుకెళ్లడం ఒక మంచి సంకేతం’ అని రజత్ పాటీదార్ చెప్పాడు.
‘మేము మధ్య ఓవర్లలో ఎక్కువ వికెట్లు కోల్పోయాం. అదే మ్యాచ్పై ప్రభావం చూపింది. ఆ సమయంలో మేము ఒత్తిడిలోకి వెళ్లిపోయాం. భువనేశ్వర్ కుమార్ టీ20 ఫార్మాట్లో అనుభవజ్ఞుడైన బౌలర్ అని అందరికీ తెలిసిందే. మ్యాచ్ తొలి భాగంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ 2026ఓ ఇంకా ప్రయాణం చాలానే ఉంది. మేము ఒక్కో మ్యాచ్ను ఆడుతూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నాం. పాయింట్ల పట్టిక గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. మంచి క్రికెట్ ఆడడమే మా లక్ష్యం’ అని ఆర్సీబీ కెప్టెన్ తెలిపాడు.
