Site icon NTV Telugu

Prabhsimran Singh: బ్యాటింగ్‌లో ఎవరినీ కాపీ కొట్టను.. కీపింగ్‌లో మాత్రం ఆ దిగ్గజంలా ఉండేందుకు ప్రయత్నిస్తా!

Prabhsimran Singh Ms Dhoni

Prabhsimran Singh Ms Dhoni

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు అద్భుత ఆరంభం దక్కింది. ఇప్ప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలవగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పంజాబ్ విజయానికి ప్రధాన కారణం ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఓపెనింగ్ జోడీ. ఈ జోడీ మధ్య ఉన్న అద్భుత అండర్‌స్టాండింగ్, ఆటతీరు జట్టుకు బలంగా మారింది. ఐపీఎల్ 2025లోనే వీరిద్దరూ కలిసి 532 పరుగులు సాధించి ఓపెనింగ్‌లో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2026 సీజన్‌లో కూడా అదే జోష్ కొనసాగిస్తూ.. జట్టుకు అద్భుత విజయాలు అందించారు.

ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్యలు చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 4.1 ఓవర్లలో 61 పరుగుల మెరుపు భాగస్వామ్యం నమోదు చేశారు. తాజాగా ప్రభ్‌సిమ్రన్ మాట్లాడుతూ తమ జోడీ విజయానికి ప్రధాన కారణం ఏంటో చెప్పాడు. ఇద్దరి మాడ్యూల్ అవగాహన, టీమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడమేనని వెల్లడించాడు. ‘ప్రతి మ్యాచ్‌లో ఒకరే ధాటిగా చేయాల్సిన అవసరం లేదు. నేను దూకుడుగా ఆడినపుడు ప్రియాంశ్ సింగిల్స్ తీసి నాకు స్ట్రైక్ ఇస్తాడు. అలాగే అతడు బౌండరీలు కొడుతున్నప్పుడు నేను సింగిల్స్ తీస్తాను. ఇది జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది’ అని చెప్పాడు.

ఐపీఎల్ 2025లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ 30 సిక్సర్లు బాది టాప్ సిక్స్ హిటర్లలో ఐదో స్థానంలో నిలిచాడు. తన సిక్స్ హిట్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో చేసిన ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడిందని చెప్పాడు. ‘ప్రాక్టీస్‌లో పలు రకాల పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయాలి. సిక్సర్లు కొట్టడం, ఎక్కువసేపు క్రీజులో నిలబడటం, కొత్త బంతి, పాత బంతి ఎదుర్కోవడం.. అన్ని టెక్నిక్‌ను మెరుగుపర్చాయి’ అని వివరించాడు. వికెట్‌ కీపర్‌గా తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు దిగ్గజం ఎంఎస్ ధోనీని ఆదర్శంగా తీసుకుంటున్నానని ప్రభ్‌సిమ్రన్ వెల్లడించాడు. ‘మహీ భాయ్ కీపింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన చేతులు చాలా ఫాస్ట్. నేను బ్యాటింగ్‌లో ఎవరినీ కాపీ చేయను కానీ.. కీపింగ్‌లో మాత్రం ధోనీలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని తెలిపాడు.

Also Read: IPL Trophy: తొలి టైటిల్ కోసం ఎదురుచూపులు.. ఆర్సీబీనే కాదు, చెన్నై-ముంబైకి తప్పని నిరీక్షణ!

ప్రభ్‌సిమ్రన్ సింగ్ తన కెరీర్ లక్ష్యాల గురించి మాట్లాడాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశాడు. ‘మా టీమ్ మీటింగ్స్‌లో కూడా అదే మాట్లాడుకుంటాం. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ గురించి ఆలోచించం. జట్టుకు మ్యాచ్‌లు గెలిపించడం ముఖ్యం. నేను ముందు 30-40 పరుగుల దగ్గర ఔట్ అవుతుండేవాడిని. ఇప్పుడు ఎక్కువసేపు క్రీజులో నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య జోడీ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. పంజాబ్ ఈ సీజన్‌లో విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి.

Exit mobile version