Site icon NTV Telugu

Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!

Petroldiesel

Petroldiesel

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాల క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనం కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు పెట్రోల్ బంక్‌ల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కొన్ని చోట్ల మాత్రం పరిమితంగా ఇంధనం అందిస్తున్నారు.

విజయవాడలో కొన్ని బంక్‌లలో మోటార్ సైకిళ్లకు రూ.300 వరకు మాత్రమే, ఫోర్ వీలర్లకు రూ.1500 వరకు మాత్రమే పెట్రోల్, డీజల్ పోస్తున్నట్లు సమాచారం. దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేతి వాటం చూపించి అధిక ధరలకు ఇంధనం అమ్ముతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం స్పందన కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Also Read: Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!

పెట్రోల్ బంక్‌ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. భారీ క్యూల వల్ల రోడ్లపై రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పెట్రోల్ బంక్ యాజమాన్యాలు తెలిపిన ప్రకారం.. ప్రస్తుతం ఉన్న ఇంధన నిల్వలు మరో మూడు నుంచి నాలుగు గంటలకే సరిపోతాయని చెబుతున్నారు. దీంతో వినియోగదారుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో అన్న సందేహం ప్రజలను కలవరపెడుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత సమస్య త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజలకు మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Exit mobile version