ఐపీఎల్ అనేది కేవలం గ్లామర్, స్టార్ ప్లేయర్లకు వేదిక మాత్రమే కాదు.. దేశంలోని మూలాల నుంచి వచ్చే ప్రతిభకు అవకాశం కల్పించే అద్భుతమైన వేదిక కూడా. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ప్రాంచైజీ మరోసారి నిరూపించింది. స్టార్ ప్లేయర్ల కన్నా.. యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతోంది. ఎల్ఎస్జీ ఎప్పటికప్పుడు ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలుగులోకి తీసుకువస్తోంది. అనామక ఆటగాడిని ప్రపంచం మొత్తం చూసేలా చేస్తోంది. ఈ లిస్టులో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు.
తాజాగా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో ముకుల్ చౌదరి అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజస్థాన్లోని ఝున్ఝునుకు చెందిన ఈ యువ ఆటగాడు.. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 27 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్లో 7 సిక్సర్లు ఉండటం విశేషం. 200 స్ట్రైక్ రేట్తో ఆడిన ఈ ఇన్నింగ్స్ అతని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ రూ.2.6 కోట్లకు కొనుగోలు చేయడం ఎల్ఎస్జీ సాహసోపేతమైన నిర్ణయమే.. ఒక్క ఇన్నింగ్స్తో పెట్టిన డబ్బుకు న్యాయం చేశాడు.
మయాంక్ యాదవ్ స్టోరీ కూడా ప్రేరణాత్మకం. 2022లో కేవలం రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ను జట్టు గాయాల సమయంలో కూడా అండగా ఉంది. 2024 ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మయాంక్ 155.8 కిమీ వేగంతో బంతులు వేసి సంచలనం సృష్టించాడు. భారత జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చి తన ప్రతిభను చాటుకున్నాడు. దిగ్వేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్ వంటి అన్క్యాప్డ్ ఆటగాళ్ల టాలెంట్ను కూడా ఎల్ఎస్జీ గుర్తించి ప్రోత్సహిస్తోంది. వేలంలో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. వీరిలో ఉన్న ప్రతిభను జట్టు ముందుగానే గుర్తించి అవకాశాలు ఇస్తోంది. ఇదే ఎల్ఎస్జీ ప్రత్యేకత.
ఐపీఎల్ ద్వారా ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ వంటి యువ సంచలనాలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. దేశంలో ప్రతిభ కొదవలేదు.. కానీ సరైన అవకాశం అవసరం. ఆ అవకాశాన్ని అందించడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషిస్తోంది. అందులోనూ ఎల్ఎస్జీ యువ ఆటగాళ్లకు అవకాశాలను ఇస్తోంది. ప్రతి ఆటగాడిలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి, ఒత్తిడి సమయంలో కూడా వారికి మద్దతు ఇవ్వడం ద్వారా ఎల్ఎస్జీ ప్రశంసలు అందుకుంటోంది. ‘ఈ కొత్త టాలెంట్ను లక్నో ఎలా పడుతుందయ్యా’ అంటూ ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
