Kavya Maran Crying: ఎస్ఆర్‌హెచ్ దారుణ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్!

  • ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓటమి
  • వెక్కివెక్కి ఏడ్చిన ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్
  • ఎమోషనల్‌కు గురవుతున్న ఎస్ఆర్‌హెచ్ ఫాన్స్
Kavya Maran Crying

Kavya Maran Crying

Kavya Maran Crying After SRH Eliminate From IPL 2026: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్.. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లు ఉన్నాయి. వైభవ్ దాడికి ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయగా.. రాజస్థాన్ భారీ స్కోర్ సాధించి చివరికి 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 నుంచి నిష్క్రమించింది.

మ్యాచ్ అనంతరం ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జట్టు ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏడుస్తూ కూడా బాగా ఆడారంటూ సన్‌రైజర్స్ ఆటగాళ్లను ప్రశంసించారు. స్టేడియంలో కావ్య పాప ఎమోషనల్‌గా కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని సీజన్లుగా ఎస్ఆర్‌హెచ్ జట్టుకు కావ్య ఎంతగా మద్దతుగా నిలుస్తున్నారో అభిమానులకు తెలిసిందే. గెలుపులో ఆనందంతో ఉప్పొంగిపోయే ఆమె.. ఓటముల్లో కూడా అదే స్థాయిలో బాధపడుతుంటారు. ఇప్పుడు ఎలిమినేటర్‌లో దారుణ ప్రదర్శనతో ఎస్ఆర్‌హెచ్ నిష్క్రమించడంతో కావ్య కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కూడా ఎమోషనల్‌కు గురి చేసింది.

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్. బుడ్డోడు ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒక దశలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడేమో అనిపించింది. అయితే సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్ మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేసింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను వైభవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. మరోవైపు జోఫ్రా ఆర్చర్‌ (3/58) కీలక వికెట్స్ పడగొట్టి ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణమయ్యాడు.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. వైభవ్ సహా ధ్రువ్‌ జురెల్‌ (50; 21 బంతుల్లో) ధాటిగా ఆడాడు. హింగే మూడు వికెట్స్ పడగొట్టాడు. ఛేదనలో ఎస్ఆర్‌హెచ్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (38; 20 బంతుల్లో) టాప్ స్కోరర్. ఇషాన్‌ కిషన్‌ (33), సలీల్‌ అరోరా (35) రాణించారు. ఇప్పుడు రాజస్థాన్ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొనుంది. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైభవ్ సూర్యవంశీ ఇదే ఫామ్ కొనసాగిస్తే రాజస్థాన్ ఫైనల్‌కు చేరడం ఖాయం.