ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు అద్భుత ఫామ్తో దూసుకెళ్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్లో పటిష్ట సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి.. క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఇక ఇప్పుడు ఫైనల్కు మరో అడుగు దూరంలో నిలిచింది. నేడు గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు జట్టు సరైన దారిలో వెళ్తోందని చెప్పిన ఆర్చర్.. పంజాబ్ కింగ్స్ పరిస్థితి తమకు రాకూడదని హెచ్చరించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ పవర్ప్లేలోనే మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. తొలి మూడు ఓవర్లలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ను కుదేలు చేశాడు. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్చర్ ఇచ్చిన ఈ షాక్ నుంచి హైదరాబాద్ కోలుకోలేకపోయింది. మ్యాచ్ అనంతరం ఆర్చర్ మాట్లాడుతూ.. ‘పవర్ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన జట్టే మ్యాచ్ గెలుస్తుంది. ఆ బాధ్యత నాపై ఉందని తెలుసు. అందుకే జట్టు కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని చెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం రెండో ఐపీఎల్ టైటిల్కు కేవలం రెండు విజయాల దూరంలో ఉంది. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ను ఓడిస్తే.. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. క్వాలిఫయర్-2 నేపథ్యంలో ఆర్చర్ తన జట్టును అప్రమత్తం చేశాడు. ‘మేము ఇప్పుడు సరైన సమయంలో సరైన దారిలో వెళ్తున్నాం. కానీ పంజాబ్ కింగ్స్కు జరిగిన పరిస్థితి మాకు రావొద్దు. చిన్న తప్పిదం కూడా పెద్దగా ప్రభావం చూపుతుంది. క్వాలిఫయర్-2లో అన్ని సవ్యంగా సాగాలి. అందరూ బాధ్యత తీసుకొని ఆడాలి. చిన్న అవకాశాన్ని కూడా వదలకూడదు’ అని అన్నాడు.
ఆర్చర్ ప్రస్తావించిన విషయం ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎదుర్కొన్న పతనం. లీగ్ దశ ప్రారంభంలో వరుసగా ఏడు మ్యాచ్లు గెలిచిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా ఆరు ఓటములు చవిచూసి ప్లేఆఫ్స్కు కూడా చేరలేకపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్, బ్యాటింగ్ వైఫల్యం, మిస్ క్యాచ్లు, అవకాశాలను చేజార్చుకోవడం లాంటివి పంజాబ్ ఓటములకు కారణం అయ్యాయి. అదే పరిస్థితి తమ జట్టుకు రాకూడదని ఆర్చర్ అంటున్నాడు. ప్రస్తుతం రాజస్థాన్ జట్టులో ఉన్న ఆత్మవిశ్వాసం, వైభవ్ ఫామ్, ఆర్చర్ బౌలింగ్ చూస్తుంటే ఈసారి టైటిల్పై ఆ జట్టు కన్నేసిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి క్వాలిఫయర్-2పైనే ఉంది. గుజరాత్ టైటాన్స్ను ఓడించి ఆర్ఆర్ ఫైనల్కు చేరుతుందా? లేక జీటీ మళ్లీ సత్తా చాటుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
