Highest targets chased down in IPL: టీ20 క్రికెట్ అంటేనే దూకుడు, భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత ముగింపులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ దూకుడు, భారీ స్కోర్లు మరింత ఎక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం దాదాపు అసాధ్యం. కానీ కొన్ని జట్లు అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ చరిత్ర సృష్టించాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యాలను విజయవంతంగా ఛేజ్ చేసిన రెండు టీమ్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ రెండు టీమ్స్ మరేవో కాదు.. పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్. పంజాబ్, హైదరాబాద్ టాప్ రికార్డు చేజింగ్ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.
ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి సెన్సేషన్ సృష్టించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన ఛేజ్గా నిలిచింది. ఇదే పంజాబ్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి మరో రికార్డు సృష్టించింది. భారీ టార్గెట్లను కూడా ఎలాంటి బెరుకు లేకుండా ఛేజ్ చేసే సామర్థ్యం పంజాబ్ జట్టుకు ఉందని చెప్పడానికి ఈ రెండు మ్యాచ్లే ఉదాహరణ.
ఈ జాబితాలో సన్రైజర్స్ హైదరాబాద్ కూడా తనధైన ముద్ర వేసింది. 2025లో పంజాబ్పై 246 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. 2026లో ముంబై ఇండియన్స్పై 244 పరుగుల భారీ టార్గెట్ను ఛేజ్ చేసి మరోసారి సన్రైజర్స్ తన బ్యాటింగ్ బలం చాటుకుంది. 2026లోనే రాజస్థాన్ రాయల్స్పై 229 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. దాంతో రికార్డు చేజింగ్ లిస్ట్ టాప్-5లో మూడు సార్లు చోటు దక్కించుకుంది.
ఈ రికార్డులు చూస్తే.. ఆధునిక టీ20 క్రికెట్లో బ్యాటింగ్ ఎంతగా మారిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పుడు 180-200 స్కోర్లు భారీ టార్గెట్గా భావించేవారు. కానీ ఇప్పుడు 230-260 స్కోర్ చేసినా గెలుస్తామనే నమ్మకం లేదు. ఓపెనర్లు పవర్ప్లే నుంచే దూకుడుగా ఆడటం, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడం, ఫినిషర్లు గేమ్ను ముగించడం వంటి అంశాలు ఈ భారీ ఛేజింగ్లకు కారణంగా మారాయి. మొత్తంగా చెప్పాలంటే.. ఐపీఎల్ ఇప్పుడు పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారింది. భవిష్యత్తులో ఈ రికార్డులు బద్దలయ్యే అవకాశాలు లేకపోలేదు.
