Virat Kohli Next Match: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మరోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించి, తన కలను నిజం చేసుకున్న స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ తదుపరి ఎప్పుడు మైదానంలో కనిపిస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ అందించిన కోహ్లీ ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్నాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 43 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చివర్లో విజయం సాధించే సిక్స్ కొట్టిన కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇక, మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ, “ఐపీఎల్ ట్రోఫీ గెలిచి, చివరి పరుగులు నేనే చేయాలని ఎన్నోసార్లు కలగన్నాను. ఈ రోజు అది నిజమైంది. ఇది నా కలల రోజు” అని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ విజయానికి కేవలం కోహ్లీ మాత్రమే కాకుండా జట్టులోని పలువురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, రసిఖ్ సలాందర్ వంటి బౌలర్లు జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించారు. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మ్యాచ్లు గెలిపించడంతో తనపై ఒత్తిడి తగ్గిందని కోహ్లీ పేర్కొన్నాడు.
కోహ్లీ తదుపరి మ్యాచ్ ఎప్పుడు?
టీ20 అంతర్జాతీయాలు, టెస్టు క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత జట్టుకు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ – ఆఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న వన్డే సిరీస్లో కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. భారత్, ఆఫ్గాన్ మధ్య ముందుగా జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. అనంతరం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జూన్ 13న ప్రారంభం కానుంది. రెండో, మూడో వన్డేలు వరుసగా జూన్ 17, జూన్ 20 తేదీల్లో నిర్వహించనున్నారు. దీంతో ఐపీఎల్ 2026లో టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ తదుపరి సారి జూన్ 13న ఆఫ్గానిస్థాన్తో జరిగే తొలి వన్డేలో భారత జెర్సీలో అభిమానులను అలరించనున్నాడు. అభిమానులు ఇప్పటికే ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
