RR vs RCB Controversy: ఐపీఎల్ 2026 సీజన్లో అతిపెద్ద వివాదం వెలుగులోకి వచ్చింది. ఆర్ఆర్ VS ఆర్సీబీ మ్యాచ్లో జరిగిన ఓ ఘటన పెద్ద కాంట్రర్సీకి దారి తీసింది. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఫ్రాంచైజీ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో కూర్చుని తన ఫోన్ను ఉపయోగిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బీసీసీఐ అవినీతి నిరోధక (Anti-Corruption) నిబంధనల ప్రకారం, మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో ఫోన్ వాడటం పూర్తిగా నిషేధం. ఈ రూల్ను రోమీ భిందర్ అతిక్రమించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అసలేం జరిగింది?
శుక్రవారం జరిగిన ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అందరూ మ్యాచ్ను వీక్షిస్తున్నారు. కెమెరా ఒక్కసారిగా డగౌట్ వైపు తిరిగింది. ఈ టైమ్లో రోమీ భిందర్ తన ఫోన్ వాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో ఆయన పక్కనే జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. రోమీ భిందర్ ఫోన్ స్క్రీన్ వైపు వైభవ్ చూస్తున్నట్లు వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది. ఈ అంశం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా (PMOA ప్రోటోకాల్ బ్రీచ్) పరిగణించబడుతోంది. దీనిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
PMOA ప్రోటోకాల్ ఏం చెబుతోంది?
ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం 2026 PMOA (ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా) నిబంధనలు ప్రకారం.. డగౌట్ లేదా నిబంధనలు వర్తించే ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం నిషిద్ధం. టీమ్ మేనేజర్ తన వద్ద ఫోన్ ఉంచుకోవచ్చు కానీ, దానిని కేవలం డ్రెస్సింగ్ రూమ్ ఏరియాలో మాత్రమే వాడాలి. డగౌట్లో ఫోన్ వాడటం నిబంధనలకు విరుద్ధం. ఇక ఈ అంశంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. “డగౌట్లో మొబైల్ ఫోన్ వాడటం అనేది అస్సలు ఊహించలేని విషయం. ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ జరిగితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్కడ యాంటీ కరప్షన్ యూనిట్ ఏం చేస్తోంది?” అని ట్వీట్ చేయడం గమనార్హం. మరోవైపు.. ఈ ఉల్లంఘనపై ఐపీఎల్ అధికారులు కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.
— Cricket Iconic (@ankanghosh335) April 11, 2026