ఐపీఎల్ 2026 సీజన్లో వరుస సవాళ్లను ఎదుర్కొంటున్న ముంబయి ఇండియన్స్ (MI) జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా రాబోయే కనీసం రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రీడా వర్గాల సమాచారం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన హోరాహోరీ పోరులో రోహిత్ శర్మ గాయపడటమే దీనికి ప్రధాన కారణం.
ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఫిజియోలు మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ.. నొప్పి తగ్గకపోవడంతో ఆయన ‘రిటైర్డ్ హర్ట్’గా వెనుదిరగాల్సి వచ్చింది. స్కానింగ్ నివేదికల ప్రకారం.. రోహిత్ కండరాలకు విశ్రాంతి అవసరమని, లేనిపక్షంలో గాయం తీవ్రత పెరిగే అవకాశం ఉందని వైద్య బృందం హెచ్చరించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మేనేజ్మెంట్ ఆయనకు రెండు మ్యాచ్ల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read:144Hz AMOLED డిస్ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
ప్రస్తుత సీజన్లో ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్ శర్మ అనుభవం అత్యంత కీలకం. ఓపెనర్గా రోహిత్ ఇచ్చే శుభారంభం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఆయన లేకపోవడం పెద్ద లోటే అని చెప్పాలి.
టీమ్ ఇండియా ఆందోళన..
ఐపీఎల్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ సిరీస్లు ఉన్న నేపథ్యంలో.. రోహిత్ గాయం టీమ్ ఇండియా మేనేజ్మెంట్ను కూడా కలవరపెడుతోంది. బీసీసీఐ (BCCI) వైద్య బృందం కూడా ముంబయి ఫిజియోలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. రోహిత్ శర్మ త్వరగా కోలుకుని జట్టులోకి రావాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. హిట్ మ్యాన్ గైర్హాజరీలో ముంబయి ఇండియన్స్ తన తదుపరి ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.