Mohsin Naqvi: అహ్మదాబాద్లో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్ను వీక్షించేందుకు బీసీసీఐ స్వయంగాపాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆహ్వానించిందనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు ఈ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. బీసీసీఐ ఆయనకు ఎలాంటి వ్యక్తిగత ఆహ్వానమూ పంపలేదని పీటీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026 ఫైనల్ వీకెండ్లో అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) బోర్డు సమావేశం చుట్టూ నడుస్తున్న ఉత్కంఠకు, ఊహాగానాలకు తాజా సమాచారంతో పూర్తి స్పష్టత వచ్చేసింది. మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ముగింపు మ్యాచ్కు గానీ, దానితో పాటే జరిగే ఐసీసీ బోర్డు సమావేశానికి గానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ వ్యక్తిగతంగా హాజరుకావడం లేదు. పీటీఐ (PTI) నివేదిక ప్రకారం.. ఇతర దేశాల్లో సమావేశం ఉన్నప్పుడు రాలేని సభ్య దేశాల ప్రతినిధుల కోసం ఐసీసీ నియమావళిలో ఒక ప్రత్యేక నిబంధన ఉంది. అదే వీడియో కాన్ఫరెన్స్. ఈ ప్రత్యేక నిబంధనను ఉపయోగించుకుని, నఖ్వీ ఈ కీలకమైన ఐసీసీ డైరెక్టర్ల బోర్డు సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ (వర్చువల్) ద్వారా హాజరుకానున్నారు.
నిజానికి ఐసీసీ బోర్డు డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్లు, కమిటీ సభ్యులు, అగ్రశ్రేణి నాయకత్వంతో కూడిన ఈ ప్రతిష్టాత్మక సమావేశాలు మార్చి 25 నుంచి 27 తేదీల మధ్య ఖతార్లోని దోహాలో జరగాల్సి ఉండింది. ఖతార్ ఒలింపిక్ కమిటీ, ఖతార్ క్రికెట్ అసోసియేషన్తో ఐసీసీకి ఉన్న పెరుగుతున్న సత్సంబంధాలకు, అక్కడ క్రికెట్ అభివృద్ధికి గుర్తింపుగా ఈ సమావేశాన్ని దోహాలో నిర్వహించాలని ఐసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ క్రికెట్ వర్తమాన, భవిష్యత్తు కాలానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే ఈ పాలనాపరమైన సమావేశాన్ని దోహాలో పెట్టడం ద్వారా అక్కడి క్రీడా రంగానికి మరింత ఊతం ఇవ్వాలని ఐసీసీ భావించింది. కానీ, పశ్చిమ ఆసియాలో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత నెలలో జరగాల్సిన ఈ సమావేశాన్ని వాయిదా వేసి, భారత్కు మార్చాల్సి వచ్చింది. ఈ సమావేశంలో అన్నింటికంటే ముఖ్యంగా గ్లోబల్ బ్రాడ్కాస్టింగ్ (ప్రసార) హక్కులపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఎందుకంటే ఐసీసీ, జియోస్టార్ (JioStar) మధ్య ఉన్న ప్రస్తుత భారీ ఒప్పందం 2027తో ముగియనుండటమే దీనికి కారణం.
అయితే, నఖ్వీ మొదటి నుంచీ ఈ సమావేశానికి స్వయంగా వస్తారని ఐసీసీ భావించలేదు. ఆయన వర్చువల్గా హాజరవ్వడం ఐసీసీ సాధారణ ప్రామాణిక పద్ధతుల్లో భాగమేనని పీటీఐ నివేదిక స్పష్టం చేసింది. కేవలం నఖ్వీ మాత్రమే కాకుండా, మరో ఇద్దరు సభ్యులు కూడా ఇదే విధంగా సమావేశానికి ఆన్లైన్ ద్వారా హాజరవుతున్నారు. అయితే మిగిలిన అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు చెందిన అగ్రశ్రేణి నిర్వాహకులు మాత్రం అహ్మదాబాద్లో ప్రత్యక్షంగా అందుబాటులో ఉండనున్నారు. ఇక తాజాగా పాకిస్థాన్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. అహ్మదాబాద్లో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్ను వీక్షించేందుకు బీసీసీఐ స్వయంగా నఖ్వీని ఆహ్వానించిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. బీసీసీఐ ఆయనకు ఎలాంటి వ్యక్తిగత ఆహ్వానమూ పంపలేదు. ఒకవేళ నఖ్వీ గనుక భారత్కు వచ్చి ఉంటే, అది కేవలం ఐసీసీ బోర్డు సమావేశం కోసమే తప్ప ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి మాత్రం కాదు. దీంతో ఐపీఎల్ ఆహ్వానం చుట్టూ, నఖ్వీ పర్యటన చుట్టూ నడిచిన దౌత్యపరమైన హైడ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది.
