LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్‌ఎస్‌జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!

Rishabh Pant

Rishabh Pant

LSG vs KKR: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వరకు పోరాడిన ఎల్‌ఎస్‌జీ చివరికి ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో వరుసగా ఐదో ఓటమిని నమోదు చేసుకున్న లక్నో జట్టు, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఒక దశలో 93/7తో తీవ్ర కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులో నిలిచిన రింకు సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. కేవలం 51 బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. రింకు ధాటికి కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 155/7 స్కోరు చేసింది.

Read Also: EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో

లక్ష్య ఛేదనలో ఎల్‌ఎస్‌జీ బ్యాటింగ్ కూడా ఒత్తిడికి లోనైంది. వికెట్లు కోల్పోతూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లింది. చివరి బంతికి మహమ్మద్ షమీ కొట్టిన సిక్సర్‌తో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. అయితే అక్కడ ఎల్‌ఎస్‌జీ పూర్తిగా కుప్పకూలింది. ఇక, సూపర్ ఓవర్‌లో లక్నో జట్టు ఒక వికెట్ కోల్పోయి కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప సూపర్ ఓవర్ స్కోర్లలో ఒకటిగా నిలిచింది. తర్వాత కేకేఆర్ సులభంగా లక్ష్యాన్ని చేరుకొని విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక, మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశాడు. “మాకు విరామం అవసరం. ప్రతి మ్యాచ్‌లో ఒత్తిడి ఉంటుంది. బయట కారణాలు వెతకకుండా, మనలోనే పరిష్కారాలు కనుగొనాలి. ప్రతి ఆటగాడు బాధ్యత తీసుకోవాలి. ఇది ఒక్కరిద్దరి ఆట కాదు” అని వ్యాఖ్యానించాడు. సూపర్ ఓవర్‌లో నికోలస్ పూరన్‌ను పంపిన నిర్ణయాన్ని కూడా పంత్ సమర్థించాడు. “అతను ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా, కష్ట సమయాల్లో మన ఆటగాళ్లను నమ్మాలి” అని తెలిపాడు.

మరోవైపు.. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాత్రం రింకు సింగ్ ఇన్నింగ్స్‌ను మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా పేర్కొన్నాడు. “16 ఓవర్ల తర్వాత మేము ఆడిన తీరు, ముఖ్యంగా రింకు ఇన్నింగ్స్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ఒక్క వికెట్ కూడా ఆటను మలుపు తిప్పగలదని మాకు తెలుసు” అని అన్నాడు. అలాగే బౌలర్లు సునీల్ నరైన్, కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. మ్యాచ్ హీరో రింకు సింగ్ మాట్లాడుతూ, “నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు అప్పటికే నాలుగు వికెట్లు పడిపోయాయి. చివరి వరకు నిలబడి, వదులుగా వచ్చే బంతులను బౌండరీకి పంపాలని భావించాను” అని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో 83 పరుగులతో పాటు నాలుగు క్యాచ్‌లు పట్టిన రింకు సింగ్, సూపర్ ఓవర్‌లో విజయపు షాట్ కొట్టి అసలైన హీరోగా నిలిచాడు. మరోవైపు ఎల్‌ఎస్‌జీ మాత్రం చెత్త రికార్డు మూటగట్టుకుని అభిమానులను నిరాశపరిచింది.