ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా టీ20 జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ భారత టీ20 జట్టులోకి తన పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్కు టెస్ట్, వన్డే కెప్టెన్గా వ్యవహరిస్తున్న గిల్.. చివరగా డిసెంబర్ 2025లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. 2025లో ఆడిన 15 టీ20ల్లో గిల్ కేవలం 24.25 సగటుతో 291 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు ముందు గిల్ మాట్లాడుతూ.. “భారత టీ20 జట్టుకు ఎంపికైతే ఆడటానికి నేను ఎప్పుడూ సిద్ధమే. క్రికెట్లో ఎవరూ సంపూర్ణంగా పర్ఫెక్ట్ కాలేరు, కానీ ఆ పర్ఫెక్షన్ కోసం నిరంతరం శ్రమించవచ్చు. నేను మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) అత్యుత్తమ బ్యాటర్గా ఎదగడానికి కష్టపడుతున్నాను” అని తెలిపాడు. టీ20 జట్టు ప్రణాళికల్లో ప్రస్తుతం లేకపోయినప్పటికీ, తన సన్నద్ధతపై అది ఎలాంటి ప్రభావం చూపలేదని, మానసికంగా తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశాడు. ఈ సీజన్లో గిల్ ఇప్పటివరకు 722 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు.
అయితే, భారత జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం గిల్కు గట్టి పోటీ ఎదురవుతోంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో 776 పరుగులతో టాప్లో ఉన్నాడు. వైభవ్పై గిల్ ప్రశంసలు కురిపిస్తూ, ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అతడు అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని కొనియాడాడు. భవిష్యత్తులో ప్రత్యర్థి బౌలర్లకు అతడు నరకం చూపించడం ఖాయమన్నాడు. అలాగే గుజరాత్లో తన ఓపెనింగ్ పార్ట్నర్ సాయి సుదర్శన్ (710 పరుగులు) స్థిరత్వాన్ని కూడా గిల్ అభినందించాడు. మైదానం లోపల, బయట సుదర్శన్ పాటించే క్రమశిక్షణే అతడి విజయ రహస్యమని గిల్ పేర్కొన్నాడు.
