ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న 61వ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు వీరవిహారం చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా, దేవదత్ పడిక్కల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
విరాట్ కోహ్లీ అద్భుత అర్ధసెంచరీ..
ఓపెనర్గా వచ్చిన జాకబ్ బెథెల్ (11 పరుగులు) త్వరగానే అవుట్ అయినప్పటికీ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కగా నడిపించాడు. పంజాబ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. యుజ్వేంద్ర చహల్ బౌలింగ్లో ప్రియాంశ్ ఆర్యకు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు. మరోవైపు అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం
మిడిల్ ఓవర్లలో క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ కేవలం 40 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో టిమ్ డేవిడ్ కూడా మెరుపులు మెరిపించాడు. కేవలం 12 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు. పంజాబ్ కింగ్స్ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 223 పరుగులు చేయాల్సి ఉంది.
