ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన కీలక మ్యాచ్లో లక్నో 40 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో లక్నోకు ఇది వరుసగా నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ప్లేఆఫ్స్ ఆశలు క్లిష్టమవుతున్న తరుణంలో.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
సంజీవ్ గోయెంకా అండ..
సాధారణంగా జట్టు వరుసగా ఓడిపోతుంటే యజమానులు అసహనానికి గురవుతుంటారు. కానీ, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సంజీవ్ గోయెంకా తన జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ వద్దకు వెళ్లి చాలా సేపు మాట్లాడారు. ఆయన పంత్ను ఆప్యాయంగా హత్తుకుని, ధైర్యం చెప్పారు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఓనర్ ఇలా కెప్టెన్కు అండగా నిలవడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గతంలో విమర్శలు ఎదుర్కొన్న గోయెంకా, ఇప్పుడు తనలో వచ్చిన మార్పుతో అందరి మనసులు గెలుచుకున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే..
ఈ మ్యాచ్లో లక్నో బౌలర్లు మొహమ్మద్ షమీ, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా రాణించి రాజస్థాన్ను 160 పరుగులకే పరిమితం చేశారు. అయితే, బ్యాటర్లు మాత్రం ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయారు. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో, కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (55) ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ డకౌట్ అవ్వడం జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది.
ఓటమి అనంతరం పంత్ చాలా నిరాశగా కనిపించాడు. తమ బ్యాటింగ్ వైఫల్యమే ఈ ఓటమికి ప్రధాన కారణమని అతను ఒప్పుకున్నాడు. “మా బౌలర్లు అద్భుతమైన పని చేశారు, కానీ బ్యాటింగ్ యూనిట్ గా మేము విఫలమయ్యాము. నేను కూడా బాధ్యతారాహిత్యంగా ఆడాను. మనం సమస్యలకు బయట ఎక్కడో కాకుండా, మన జట్టులోనే పరిష్కారాలు వెతుక్కోవాలి” అని పంత్ పేర్కొన్నాడు.
అయితే.. పంత్ ఇంకా ఆశలు వదులుకోలేదు. తమ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, తదుపరి మ్యాచ్ల్లో పుంజుకుని టోర్నీలో నిలబడతామని ధీమా వ్యక్తం చేశాడు. అటు ఓనర్ మద్దతు, ఇటు కెప్టెన్ పట్టుదల చూస్తుంటే లక్నో త్వరలోనే విజయాల బాట పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
