Axar Patel: సోమవారం (మే 11) ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ.. ఈ మైదానంలో అత్యధిక టీ20 ఛేదనను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఓటమితో పంజాబ్కు వరుసగా ఇది నాలుగో ఓటమి కాగా, ఢిల్లీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మ్యాచ్ అనంతరం తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో జట్టు సభ్యులు బాధ్యతాయుతంగా ఆడి విజయాన్ని అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. గత కొన్ని మ్యాచ్లుగా తాము తడబడుతున్నామని, అయితే ఈ మ్యాచ్లో ఆ లోపాన్ని అధిగమించామని అక్షర్ పేర్కొన్నాడు. తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని మొదటి నుంచీ చెబుతున్నానని గుర్తు చేశాడు. సుదీర్ఘమైన టోర్నమెంట్లో కొన్నిసార్లు ఒకటి రెండు క్షణాలే ఫలితాన్ని మారుస్తుంటాయన్నాడు. కానీ ఈరోజు జట్టు ఆడిన తీరు చాలా సంతోషాన్నిచ్చిందని వెల్లడించాడు.
తొలి 3-4 ఓవర్లలో బౌలింగ్లో 60 పరుగులు సమర్పించుకున్నప్పటికీ, ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని అక్షర్ కొనియాడాడు. ముకేష్ కుమార్, మాధవ్ తివారీ మధ్య ఓవర్లలో బౌలింగ్ చేసిన తీరు రాజస్థాన్ మ్యాచ్ను గుర్తుకు తెచ్చిందన్నాడు. అది మ్యాచ్లో అతిపెద్ద మలుపు అని తెలిపాడు. ఇక బ్యాటింగ్లో డేవిడ్ మిల్లర్తో నా భాగస్వామ్యం ఇన్నింగ్స్ను సెట్ చేయగా, అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ వంటి కుర్రాళ్లు మ్యాచ్ను అద్భుతంగా ముగించారని వివరించాడు. ఇక ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం వెనుక ఉన్న వ్యూహాన్ని వివరించాడు. “ఈరోజు వికెట్ భిన్నంగా స్పందించింది. ముఖ్యంగా ఆకిబ్ నబీ బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి స్వింగ్ అవ్వడమే కాకుండా సీమ్ కూడా అవుతోందని గ్రహించాను. పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభిస్తున్నప్పుడు స్పిన్నర్ల అవసరం లేదనిపించింది. అందుకే మాధవ్, ఆకిబ్లకు అదనపు ఓవర్లు ఇచ్చాను” అని స్పష్టం చేశాడు. ఒకవేళ మాధవ్ తివారీ పరుగులు సమర్పించుకుని ఉంటే, తాను బౌలింగ్కు వచ్చేవాడినని, అయితే బ్యాకప్ ప్లాన్లు సిద్ధంగా ఉన్నా.. మైదానంలో పేసర్లు సక్సెస్ అవ్వడం జట్టుకు కలిసి వచ్చిందని అక్షర్ చెప్పుకొచ్చాడు. ఇక పంజాబ్పై సాధించిన ఈ విజయం ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలను మరింత బలోపేతం చేసింది.
