చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు ఆల్మోస్ట్ ముగిశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలక పోరులో చెన్నై మరోసారి తడబడింది. ఆరంభంలో రాణించిన బ్యాటర్లు. కీలక దశలో పరుగులు చేయలేకపోయారు. దీంతో చెన్నై 154 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో సిఎస్కె ప్లేఆప్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఇంకా చెన్నై మరో ఐదు మ్యాచులు ఆడాల్సి ఉంది.ఈ ఐదింటిలో గెలిచి, ఆపై మిగతా జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఎటు చూసినా చెన్నైకి దారులు మూసుకుపోయాయి. దీంతో ఈ సీజన్లో ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయిన మొదటి జట్టుగా చెన్నై నిలిచింది. వాస్తవానికి ఈ సీజన్ ఆరంభం నుంచే చెన్నై పేలవ ఫామ్ కొనసాగుతుంది. వరుస మ్యాచుల్లో తమ బలాన్ని తగ్గించుకుంటూ వెళ్ళింది. అయితే ధోనీ చెన్నై తలరాతను మారుస్తాడనుకున్న వారందరికీ నిరాశే మిగిల్చాడు. కెప్టెన్ గా, బ్యాటర్ గా సక్సెస్ కాలేదు. గత 4 మ్యాచ్లలో ధోని బ్యాట్ నుండి కేవలం 6 బౌండరీలు మాత్రమే వచ్చాయి.
కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 4 ఫోర్ల సాయంతో 26 పరుగులు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 4 పరుగులు , తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్పై ఒక ఫోర్తో సహాయంతో 6 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ల గురించి మాట్లాడుకుంటే ఎంఎస్ ధోని పేరు అగ్రస్థానంలో ఉంటుంది. అతని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 5 ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. 2023 ఐపీఎల్ తర్వాత ధోని… కెప్టెన్సీ బాధ్యతలని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. అయితే ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోగా చెన్నై యాజమాన్యం జట్టు బాధ్యతల్ని ధోనికి అప్పగించింది. కానీ ధోనీ మాయాజాలం పనిచేయలేదు. ధోనీ వచ్చిన మొదటి మ్యాచ్ లో చెన్నైని గెలిపించినప్పటికీ, ఆ తర్వాత వరుస ఓటములతో ప్లేఆప్స్ అవకాశాలను కోల్పోయింది. దీంతో ధోనీ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైకి అసలు విలన్ నువ్వేనంటూ ట్విట్టర్ లో వార్ నడుస్తుంది. కొందరు ధోనీని విమర్శిస్తుంటే, ధోనీ ఫాలోవర్స్ మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.