ఐపీఎల్ 2026 తొలి రాత్రి అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని పంచింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా, దేవదత్ పడిక్కల్ మెరుపు ఇన్నింగ్స్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనా, కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 38 బంతుల్లో 80 పరుగులతో విరుచుకుపడ్డాడు. అతనికి హెన్రిచ్ క్లాసెన్ (31) తోడవడంతో నాలుగో వికెట్కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదైంది. చివర్లో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ 200 పరుగుల మార్కును దాటింది. ఆర్సీబీ బౌలర్లలో డెబ్యూ ప్లేయర్ జాకబ్ డఫీ (3/22) అద్భుతంగా రాణించగా, షెపర్డ్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు.
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ కోల్పోయి షాక్ తగిలింది. అయితే, వన్ డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (69 నాటౌట్; 38 బంతుల్లో) ఎంతో సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి హైదరాబాద్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.
పడిక్కల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31) రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరలో విరాట్ కోహ్లీ తనదైన శైలిలో వరుస బౌండరీలతో మ్యాచ్ను ముగించాడు. 16వ ఓవర్లో హర్షల్ పటేల్ బౌలింగ్లో ఒక సిక్స్, వరుసగా మూడు ఫోర్లు బాది కోహ్లీ విజయాన్ని ఖాయం చేశాడు. ఐపీఎల్లో కోహ్లీకి ఇది 64వ అర్ధశతకం కావడం విశేషం.
