Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్‌ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్

Sakshi Chaudhary

Sakshi Chaudhary

Sakshi Chaudhary: 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన బాక్సర్ సాక్షి చౌదరి తన విజయానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఒక ప్రధాన కారణమని వెల్లడించింది. తన కెరీర్‌లో అత్యంత క్లిష్ట సమయంలో విరాట్ కోహ్లీ, ఆయన ఫౌండేషన్ అందించిన సహకారం తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. ఐఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాక్షి మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ తనకు ఆదర్శమని చెప్పింది. దాదాపు మూడేళ్లపాటు ఆయన తనకు స్పాన్సర్‌గా ఉండి, ఆర్థికంగా అండగా నిలిచారని వెల్లడించింది. ఆ సహకారం వల్ల ఇతర విషయాల గురించి ఆందోళన చెందకుండా పూర్తిగా తన ఆటపై దృష్టి పెట్టగలిగానని పేర్కొంది. జీవితాంతం ఆయనకు కృతజ్ఞురాలిగా ఉంటానని సాక్షి చెప్పింది.

విరాట్ కోహ్లీ క్రమశిక్షణ, నిలకడ, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడే తీరు తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని వెల్లడించింది సాక్షి చౌదరి.. తన కెరీర్‌లో ముందుకు సాగేందుకు ఆయన మద్దతు కీలక మలుపుగా మారిందని, అదే తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అంతర్జాతీయ వేదికపై విజయాన్ని అందించిందని తెలిపింది. కాగా, ఇటీవల స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 51 కేజీల విభాగం ఫైనల్లో ఇంగ్లాండ్‌కు చెందిన రూబీ వైట్‌ను ఓడించి సాక్షి చౌదరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం భారత బాక్సింగ్‌కు కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. సాక్షి చేసిన ఈ వ్యాఖ్యలు విరాట్ కోహ్లీ సేవలు కేవలం క్రికెట్‌కే పరిమితం కావని, ఇతర క్రీడల్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కూడా ఆయన మద్దతు అందిస్తున్నారనే విషయాన్ని మరోసారి చాటిచెప్పాయి.